శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తుల రద్దీని గమనంలోకి తీసుకొన్న దేవస్థానం కీలక నిర్ణయం తీసుకొంది. దుర్మమ్మ సేవలో పాల్గొనే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయించారు. నేటి నుంచి నుంచి రెండు టైమ్ స్లాట్స్లో వారు దుర్గమ్మను దర్శించుకోవచ్చు. అయితే మూలా నక్షత్రం రోజున మాత్రం దర్శనానికి మినహాయింపునిచ్చారు.
నేటి నుంచి ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మెుదటి స్లాట్, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు రెండో స్లాట్లో వికలాంగులు, వృద్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీ దేవాదాయశాఖ అధికారులు వీలు కల్పించారు. అందుకోసం ఆలయ సమీపంలోని మోడల్ గెస్ట్ హౌస్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులకు ఈ స్పెషల్ దర్శనం కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని దేవస్థానం అధికారులు వెల్లడించారు. పాయింట్ నుంచి తీసుకెళ్లి దర్శనం అనంతరం భక్తులను తిరిగి అదే పాయింట్ వద్దకు చేర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
రెండవ రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మనసు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రంతో ఉండే అమ్మవారి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళ లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టులు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పుసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.
సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది అంటారు. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని..దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.
ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇవాళ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. అక్కడ స్వయంగా క్యూలైన్లను పరిశీలించి.. ఏర్పాట్లపై భక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తొలిరోజు అమ్మవారిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారని.. 60 వేల లడ్డూల విక్రయాలు జరిగాయన్నారు. క్యూలైన్ల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఆన్లైన్ టిక్కెట్లను స్కాన్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa