ఓ నేరస్థుడిని కాపాడేందుకు ఏకంగా ఓ గ్రామం మొత్తం రంగంలోకి దిగింది. మోస్ట్ వాంటెండ్ నేరస్థుడ్ని పట్టుకోడానికి పక్క రాష్ట్రానికి వెళ్లిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఓ మహిళ మృతిచెందగా.. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా భరత్పూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన పలు నేరాలతో సంబంధం ఉన్న మైనింగ్ మాఫియా ముఠా సభ్యుడు జఫర్పై రూ.50 వేల రివార్డు ఉందని అన్నారు. అతడు ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని జస్పర్ నుంచి భరత్పూర్లోకి ప్రవేశించినట్టు తెలియడంతో అరెస్ట్ చేయడానికి మొరాదాబాద్ పోలీసులు వచ్చారని తెలిపారు.
నేరస్థుడ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు బుధవారం సాయంత్రం అక్కడకు చేరుకోగా.. స్థానికులు అడ్డుకున్నారు. అయితే, అప్పటికే అతడు ఆ గ్రామం నుంచి తప్పించుకున్నట్టు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ చెప్పారు. ‘‘రూ.50 వేల రివార్డు ఉన్న మోస్ట్వాంటెడ్ క్రిమినల్ అతడు.. భరత్పూర్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించి అక్కడకు చేరుకునేసరికి తప్పించుకున్నాడు.. గ్రామస్థులు పోలీసులను బందీలుగా పట్టుకుని, ఆయుధాలను లాక్కున్నారు’’ అని డీఐజీ తెలిపారు.
ఈ ఘటనలో తమ సిబ్బంది ఐదుగురు గాయపడ్డారని, ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని వివరించారు. ఇక, ఘర్షణ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గురుప్రీత్ కౌర్ అనే మహిళ మృతిచెందినట్టు ఉత్తరాఖండ్ పోలీసులు ధ్రువీకరించారని శలబ్ మాథుర్ పేర్కొన్నారు. ఆమె భర్త బీజేపీ బ్లాక్ అధ్యక్షుడు గుర్జీత్ భుల్లార్ అని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. పోలీసులపై దాడిచేశారని అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa