చత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈడీ సోదాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తాజాగా మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఇటీవల చత్తీస్గఢ్ వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు అక్టోబరు 11న సోదాలు నిర్వహించారు. తాజాగా ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్ సహా మరో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఇంద్రమణి గ్రూప్ కంపెనీ యజమాని సునీల్ అగర్వాల్, పరారీలో ఉన్న వ్యాపారి సూర్యకాంత్ తివారీ బాబాయ్ లక్ష్మీకాంత్ తివారీలను రాయ్పూర్లో ఈడీ అరెస్ట్ చేసింది. చత్తీస్గఢ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్ 2009 బ్యాచ్కు చెందినవారు. ప్రస్తుతం చత్తీస్గఢ్ ఇన్ఫోటెక్ ప్రమోషన్ సొసైటీకి సీఈఓగా ఉన్నారు.
సమీర్ విష్ణోయ్ సహా పలువుర్ని బుధవారం ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్ట్ చేసింది. ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్ సంస్థలు కుమ్మకై రాష్ట్రంలోని బొగ్గు, మైనింగ్ రవాణాదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించింది. ఐఏఎస్ అధికారి, రాయ్గఢ్ కలెక్టర్ రేణు సాహు నివాసాన్ని కూడా సీల్ చేసింది. దాడుల సమయంలో తాను అనారోగ్యంతో చికిత్స తీసుకుకోవడం వల్ల అందుబాటులో లేనని, ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఈడీకి తెలియజేశారు.
అయితే, 2010 బ్యాచ్కు చెందిన రేణు సాహు.. స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ రాయ్పూర్లో కార్యాలయానికి ఇంకా హాజరు కాలేదని ED వర్గాలు తెలిపాయి. తాజా సోదాల్లో రూ. 4 కోట్ల నగదు, భారీగా ఆభరణాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. దోపిడీకి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది.
ఇదిలావుంటే ఈ సోదాలపై చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa