ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరకట్న వేధింపులతో మహిళా ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 04:21 PM

గార్లదిన్నె, మండలంలోని మర్తాడు గ్రామంలో వేధింపులు తాళలేక నందిని(25) ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జరిగింది. మండలంలోని మర్తాడు గ్రామానికి చెందిన నారాయణస్వామికి పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన పుల్లయ్య, జయలక్ష్మి దంపతుల కుమార్తె నందినిని ఇచ్చి ఐదేళ్ల కిందట పెళ్లి చేశారు. వివాహ సమయంలో ఎనిమిది తులాల బంగారంతో పాటు రూ.50వేలు కట్నంగా అందజేశారు. నారాయణస్వామి, నందిని దంపతులకు నాలుగేళ్ల కుమారుడున్నాడు. నందినిని భర్త నారాయణస్వామితో పాటు అత్త లక్ష్మిదేవి తరచూ వేధించేవారని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. మంగళవారం రాత్రి నందిని బహిర్భూమికి గ్రామ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో భర్త నారాయణస్వామి అక్కడికి వెళ్లి వెతికారు. అయితే కాలువపై నందిని చెప్పులు, సెల్‌ఫోన మాత్రమే ఉన్నాయని, తన భార్య కన్పించలేదని పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ హెచ్చెల్సీలో తెప్పల ద్వారా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం నందిని మృతదేహం కాలువలో చెట్టుకు తగులుకొని కన్పించింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు జయలక్ష్మి, పుల్లయ్య, బంధువులు బోరున విలపించారు. తమ కూతురుని భర్తతో పాటు అత్తింటి వారే వేధించి బలితీసుకున్నారని మృతదేహంపై పడి రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa