తరతరాలుగా రైతులు సాగుచేస్తున్న నారాయణపురం భూములకు సాగు హక్కు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, ఎచ్చెర్ల కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు కె.మోహనరావు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సాగు రైతులు నాగళ్లు పట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 21న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. చిలకపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ కుటుంబాలకు చెందిన వారు తరతరాలుగా సుమారు 200 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో 2012 వరకు సాగుదారుల పేర్లు నమోదై ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ అండతో రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మకై రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. సాగురైతులకు న్యాయం చేస్తామని హామీనిచ్చినప్పటికీ నెరవేరలేదన్నారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వైపీ ప్రసాద్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి పొందూరు చంద్రరావు, భూపోరాట కమిటీ నేతలు తోనంగి నందోడు, సీతారాం బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa