రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో లీగల్ టీంలు పనిచేస్తున్నాయని, కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని టీడీనీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని తాను భావించేవాడినని వెల్లడించారు. కుప్పం ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించానని తెలిపారు. "ఇక్కడ పోలీసు స్టేషన్, కోర్టులు, జైళ్ల అవసరం రాకూడదు అనుకునేవాడిని. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ వైసీపీ దుర్మార్గులను ఎదుర్కోవడానికి నేనే లాయర్లు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. కుప్పంలో 70 మందిని అరెస్టు చేసి 20 రోజులు జైళ్లలో పెట్టారు. మనం ఒక సైకోను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సైకోలను కట్టడి చేయాలంటే తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలపై అత్యంత చురుగ్గా పనిచేయాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఐపీసీ సెక్షన్లు చదువుకోవాల్సిన అవసరం రాలేదని, కానీ, జగన్ రెడ్డి చట్టవ్యతిరేక పాలన కారణంగా నేడు వాటిని తెలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. 175 నియోజకవర్గాలలో లీగల్ టీంలు పనిచేస్తున్నాయని, కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని వెల్లడించారు. "ప్రతి నియోజకవర్గంలో లీగల్ టీంలు లీగల్ స్క్రూటినీ చేసి కార్యకర్తలకు న్యాయపరమైన సహాయం అందించాలి. 27 దళిత పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డిని ప్రశ్నించినందుకు గుడివాడలో ఒక మహిళపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇది చాలా దుర్మార్గం" అని పేర్కొన్నారు.
పోలీసులు అప్రజాస్వామికంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడానికి వస్తే ఏ కేసుపై అరెస్టు చేస్తున్నారో అడిగి రాతపూర్వక నోటీసులు అడగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. "పోలీసులు బ్యాడ్జ్ లేకుండా వస్తే బ్యాడ్జ్ పెట్టుకోమని అడగండి. అదే సమయంలో లోకల్ పార్టీ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తే కచ్చితంగా సీసీ కెమెరాల రికార్డింగు చేయమని అడగండి" అంటూ దిశానిర్దేశం చేశారు.
హౌస్ అరెస్టులు చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేశారు. హౌస్ అరెస్టులు చేయాలంటే ఇంటిని జైలుగా మార్చేందుకు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. "బాబ్లీ అంశంలో మహారాష్ట్రకు మేం వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు మమల్ని అరెస్టు చేసి మేమున్న హాస్టల్ ను జైలుగా మార్చి మమ్మల్ని అక్కడే ఉంచారు. అలా చేయకపోతే వారికి మమ్మల్ని హౌస్ అరెస్టు చేసే అధికారం లేదు" అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa