తన వ్యాపార నిర్వహణ కోసం దుబాయ్ లేదా న్యూయార్క్లో ఫ్యామిలీ ఆఫీస్ను తెరవనున్నట్లు ఇటీవల బ్లూమ్బెర్గ్ నివేదించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ స్పషంచేశారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచవ్యాప్తంగా చూసినా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో టాప్-5లో ఉన్నారు దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ. ఆయన సంపద ఏకంగా 130 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. మరి అదానీ ఇటీవలి కాలంలో మరింత దూకుడు పెంచారు. పలు రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్నారు. తన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ లేదా గ్రూప్ విలువను లక్ష కోట్ల డాలర్లకు (1000 బిలియన్ డాలర్లు) చేర్చే విధంగా దూసుకెళ్తున్నారు. భారత కరెన్సీలో రూ.82 లక్షల కోట్లకుపైనే. దీంతో వేల కోట్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఎదురేలేకుండా దూసుకెళ్తున్నారు.
అయితే అదానీ గురించి ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి. ఆయన తన వ్యాపార నిర్వహణ కోసం దుబాయ్ లేదా న్యూయార్క్లో ఫ్యామిలీ ఆఫీస్ను తెరవనున్నట్లు ఇటీవల బ్లూమ్బెర్గ్ నివేదించింది. దీంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ క్లారిటీ ఇచ్చేసింది. అలాంటిదేం లేదని పేర్కొంది. మీడియా ఇలా చేయడాన్ని, తప్పును ప్రసారం చేయడాన్ని దురదృష్టకరంగా అభివర్ణించింది.
''అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.. దుబాయ్ లేదా న్యూయార్క్లో ఫ్యామిలీ ఆఫీస్ను తెరవనున్నారు అని వచ్చిన బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ను చూశాం. అందులో ఎలాంటి వాస్తవం లేదు.'' అని అదానీ గ్రూప్ తెలిపింది. అదానీ గానీ, అదానీ కుటుంబం గానీ విదేశాల్లో కుటుంబ కార్యాలయాన్ని తెరిచే యోచనలో లేదని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధార వార్తలు ప్రచురించడాన్ని దురదృష్టకరంగా పేర్కొంది.
అదానీ తన సంపద సహా ఇతర వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్లు నిర్వహించేందుకు వీలుగా దుబాయ్ లేదా న్యూయార్క్లో ఫ్యామిలీ ఆఫీస్ను తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఇందుకోసం మేనేజర్లను నియమించే యోచనలో ఉన్నారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అయితే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ తెరుస్తున్నారని, అక్కడ కూడా మేనేజర్లను నియమించుకున్నారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. దీనిపై మాత్రం రిలయన్స్ ఆఫీస్ ఇప్పటివరకు స్పందించలేదు.
60 ఏళ్ల భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈయన నికర సంపద 132 బిలియన్ డాలర్లు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్, LVMH సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మాత్రమే అదానీ కంటే ముందున్నారు. ప్రస్తుతం ఆసియాలో మాత్రం అదానీనే నంబర్ వన్గా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa