కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న నరేం ద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, పత్తికొండ సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళ వారం స్థానిక సీఆర్ భవన్లో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల జనరల్బాడీ సమావేశం సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజి నేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి రాకమునుపు వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తానని, నిరుద్యోగ సమస్యను పరిష్క రిస్తామని హామీలను గుప్పించారని, అయితే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చిన కేంద్రం మాటతప్పిందన్నారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఏపీకి తీరని అన్యాయం చేశారన్నారు. జగనన్న కాలనీల్లో నిర్మించే ఇళ్లకు రూ.1.80లక్షలు నుంచి రూ.5లక్షల వరకు ఇవ్వాలని కోరుతూ డిసెంబరు 5న మండల కేంద్రాల్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ డిసెంబరు 16 నుంచి 20వ తేదీ వరకు సీపీఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో చేపట్టబోయే రైతురక్షణ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు భీమలింగప్ప, జిల్లా కార్యవర్గ సభ్యుడు నబిరసూల్, రాజాసాహెబ్, మండల కార్యదర్శి సుల్తాన్, ప్రజాసంఘాల నాయకులు గురుదాసు, కారన్న, తిమ్మయ్య, రంగన్న కృష్ణయ్య, గుండుబాషా, ఎంకె సుంకన్న పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa