పిల్లలు సమయస్పూర్తితో వ్యవహరించేలా తల్లిదండ్రులు వారికి అలవాటు చేయాలి. కొన్ని సమయాలలో సమయస్పూర్తియే పిల్లలకు భద్రతనిస్తుంది. కిడ్నాపర్ల చెర నుంచి ఓ బాలుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. తనను కిడ్నాప్ చేసిన వారిలో ఒకర్ని గట్టిగా కరిచి, వ్యానులో నుంచి దూకేశాడు. అచ్చం సినిమాను తలపించే ఈ ఘటన ఢిల్లీ సరిహద్దుల్లోని ఘజియాబాద్లో శనివారం చోటుచేసుకుంది. మురాద్నగర్కు చెందిన ఆరవ్ రాఠీ అనే పదకొండేళ్ల బాలుడు శనివారం సాయంత్రం కూరగాయలు కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆరవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్ నుంచి సైకిల్పై ఇంటికి తిరుగొస్తుండగా నలుగురు వ్యక్తులు ఉన్న ఓ వ్యాను అతడి సమీపంలో ఆగింది. దీంతో వెంటనే తన సైకిల్ను పక్కకు తిప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, వారి నుంచి తప్పించుకోలేకపోయాడు.
సైకిల్తో తనను పట్టుకుని బలవంతంగా వ్యాను లోపలికి ఎక్కించారని, వారి చేతుల్లో కత్తులు, గాజు ముక్కలు, మద్యం సీసాలు ఉన్నాయని చిన్నారి తెలిపాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వ్యానును ఆపి తన ఒంటి మీదున్న దుస్తులను విప్పేసి సైకిల్తో పాటు వాటిని రోడ్డు పక్కన విసిరేశారని ఆరవ్ చెప్పాడు. ఇంతలోనే తనను పట్టుకున్న కిడ్నాపర్ చేతిని గట్టిగా కొరికేయడంతో పట్టుకోల్పోయాడని, వెంటనే వ్యానులో నుంచి దూకేసి ఇంటికి పరుగెత్తుకొచ్చానని వివరించాడు.
ఇదిలావుంటే ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులకు పట్టించుకోలేదని, ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదని ఆరవ్ తండ్రి ధర్మేంద్ర రాఠీ ఆరోపించారు. ‘‘జరిగిన సంఘటనను బయటపెట్టేలా ఈ ప్రాంతంలో కనీసం ఒక్క సీసీటీవీ కెమెరాను కూడా ఏర్పాటుచేయలేదు.. నా కొడుకు రెండు కిలోమీటర్ల దూరం నుంచి బట్టల్లేకుండా ఇంటికొచ్చాడు.. ఇప్పటి వరకూ పోలీసులు ఎవర్నీ అరెస్ట్ చేయలేదు’’ అని మండిపడ్డారు.
‘‘కిడ్నాపర్లో ఒకరి చేతిని ఆరవ్ కొరికాడు.. తలుపు తెరిచిన తర్వాత కదులుతున్న వ్యాన్ నుంచి దూకాడు. ఆ ప్రాంతాన్ని గుర్తించి 2 కిలోమీటర్ల దూరంలోని జీత్పూర్ కాలనీలో ఉన్న తన తాతయ్య ఇంటి వైపు పరుగెత్తాడు. ఈ సమయంలో నిందితులు తనను వెంబడించకుండా నిరోధించడానికి రక్షించండి.. రక్షించండి అంటూ అని కేకలు వేశాడు..’’ అని తెలిపారు.
కిడ్నాపర్లు తనను బంధీగా చేసుకుని తండ్రి నుంచి డబ్బులు డిమాండ్ చేయడం గురించి ముఠా సభ్యులు తమలో తాము మాట్లాడుకుంటున్నారని ఆరవ్ చెప్పాడు. ‘నేను తెలివిగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే వారు నాతో పాటు నా అమ్మ గొంతును కోస్తారని వారు నన్ను బెదిరించారు’ అని వివరించాడు. ఘజియాబాద్ సీనియర్ ఎస్పీ నిమిశ్ పటేల్ మాట్లాడుతూ.. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. గతవారం బులంద్షహర్లో కిడ్నాప్నకు గురైన 11 ఏళ్ల బాలిక ఘజియాబాద్ సమీపంలోని నందిగ్రామ్లో శవమై తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa