ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ ఇవ్వనున్నదా అంటే అవుననే చెబుతోంది తాజా పరిస్థితి. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భివించిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ విడుదల చేసింది. ఆ లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 9న సంతకం చేయటంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. దీంతో దేశ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా తాను జాతీయ పార్టీ ప్రకటించినట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేసి ఒక సమర్థవంతమైన పాలన అందిచేందుకే జాతీయ పార్టీ ప్రకటించినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగా పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకోనున్నట్లు చెప్పారు. ఈ మేరకు వచ్చే జనరల్ ఎలక్షన్స్లో జేడీఎస్కు తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనూ పార్టీ విస్తరణపై ప్రధానంగా ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ సరిహద్దుల్లో మహారాష్ట్రలో భారీ బహిరంగ సభకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మెుదట్నుంచి కేసీఆర్తో సన్నిహితంగా ఉంటున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్కు బీఆర్ఎస్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు భాషాల్లో ప్రావీణ్యం ఉండటంతో పాటు, ఆయనకు ఉన్న సినీ గ్లామర్ పార్టీకి ఫ్లస్ అవుతుందనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆయనకు కర్ణాటక లేదా తమిళనాడు నుంచి బీఆర్ఎస్ తరఫున కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అ వార్తలను నిజం చేస్తూ.. తాజాగా విజయవాడలో కొందరు బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలోనూ కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ నడపనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "జయహో కేసీఆర్.. దేశ రాజకీయాలలో నూతన శకం. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం. కక్ష రాజకీయాలకు స్వస్తి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా." అంటూ బండి రమేశ్, డి భవానీ కుమార్ పేరుతో ఎంజీ రోడ్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో త్వరలోనే ఏపీకి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa