ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల పట్ల జగన్ సర్కారు నిర్లక్ష్యం: దేవినేని ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 08:33 PM

రైతుల పట్ల జగన్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు  మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలయ్యిందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు చెయ్యాలని రైతన్నలు వేడుకున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్షేపించారు. తుఫాను కారణంగా మునిగిపోయిన, దెబ్బతిన్న పంటలకు షరతులు లేకుండా నష్టపరిహారం అందించాలన్నారు.


"జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలయ్యింది. చేతికొచ్చిన పంటను కోనుగోలు చెయ్యాలని అన్నదాత రోడ్డెక్కి మొత్తుకున్నా పట్టించుకోలేదు. మద్దతుధర, వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలని మాటలు చెప్పారు. ఈ క్రాప్, నిబంధనలంటూ తిప్పుకుని రైతును "మాండూస్"లో ముంచేశారు.43 నెలల్లో మీరు చెప్పిన ధరలస్థిరీకరణ నిధి ద్వారా రైతులకు ఎంతమొత్తం చెల్లించారు ? తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ధాన్యం డబ్బులు చెల్లించాలి. మునిగిపోయిన, దెబ్బతిన్న పంటలకు షరతులు లేకుండా నష్టపరిహారం అందించాలి. నేటి పరిస్థితికి కారణమైన సీఎం జగన్ రైతులకు సమాధానం చెప్పాలి." అని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.


ఇదిలా ఉండగా..ఏపీలోని పలు ప్రాంతాలపై మాండూస్ తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ఈదురు గాలులకు కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల భారీ వృక్షాలు నేల కూలాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల దారులు ఇ్బబందులు ఎదుర్కొంటున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్టంలోని పలు జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వాతావరణం అనుకూలించక పోవడంతో హైదరాబాద్ -రేణిగుంట -ఇండిగో విమానం రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.


మాండూస్ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లోని వరి, అరటి, వేరుశనగ, పత్తి, బొప్పాయి, మినుము, మిరప సహా వేలాది ఎకరాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్ జిల్లా దర్జిపల్లిలో గోడ కూలి ఓ మహిళ మృతి చెందింది. తిరుమల ఘాట్ రోడ్డులో వృక్షాలు కూలడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాపట్ల జిల్లా చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయారు. ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం తీరానికి రెండు కిలోమీటర్ల తీరంలో వారిని గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa