ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడుతున్నాడు: బొత్స సత్యనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 08:23 PM

పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. . చంద్రబాబుకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని విమర్శించారు. ఎవరైనా నిర్మాణాత్మక అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు.


రాజాం, బొబ్బిలి సభల్లో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు సదస్సులో సీఎం జగన్‌కు వ్యవసాయం గురించి ఏమి తెలుసు అన్నారని.. వ్యవసాయం దండగ అని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు వ్యవసాయం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారని.. నీతి ఆయోగ్ దేశమంతా ఆర్బీకేలు పెట్టాలని పరిశీలిస్తుంటే ఆయన మాత్రం వృథా అని చెప్పడాన్ని ప్రజలు గమనించాలన్నారు.


చంద్రబాబు పరిపాలనలో రైతులు ఆత్మహత్య చేసుకునేవారని.. ఆయన హయాంలో వ్యవసాయం భ్రష్టు పట్టిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో రైతులు బక్కచిక్కిపోయారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఆర్బీకేల ద్వారానే ఎరువులు, విత్తనాలను అందిస్తున్నామని.. మరి రైతులు ఎందుకు ధర్నా చేస్తారని నిలదీశారు. నష్టం వస్తే వారికి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం ఇస్తున్నామని తెలిపారు. రైతులు ధర్నా చేస్తే చంద్రబాబు కాల్పులు జరిపారని.. మరిచిపోయారా అని అన్నారు. నిజామ్ షుగర్స్ పరిశ్రమను ఎన్సీఎస్‌కు ఎవరు అమ్మారని సూటిగా ప్రశ్నించారు.


బీసీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో బీసీలే కనిపించడం లేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. మరి ఉత్తరాంధ్రకు చెందిన బీసీలను కేంద్ర మంత్రి చేయకుండా అశోక్‌ గజపతిరాజును ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తోటపల్లి ప్రాజెక్టును తమ హయాంలోనే 85 శాతం పూర్తి చేశామని.. ఇది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమన్నారు. రామతీర్థం సాగర్ ప్రాజెక్టును చంద్రబాబు పక్కన పెట్టేశారని.. మళ్లీ ఇప్పుడు నిధులు కేటాయించి తాము పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో తెలుసని.. అందుకే టీడీపీని ఇంటికి పంపారని మంత్రి బొత్స చురకలు అంటించారు. జగన్‌ను సైకో అంటున్న చంద్రబాబు తన భాష మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa