ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందుల నుంచి బెంగళూరు వరకు నాలుగు లేన్ల హైవే : వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 08:22 PM

క్రిస్మస్ సందర్భంగా పులివెందుల ప్రజలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. పులివెందుల నుంచి బెంగళూరు వరకు నాలుగు లేన్ల హైవే నిర్మాణం కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బెంగుళూరు నుంచి విజయవాడ వరకు ఇప్పటికే 6 లేన్ల రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలైందని ఆయన తెలిపారు. ఈ ఆరు లేన్ల హైవే కూడా వయా పులివెందుల మీదుగా వెళ్తుందని వెల్లడించారు. పులివెందుల పట్టణంలోని ఐదు జంక్షన్లలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రజల చిరకాల కోరిక అయిన రాయలపురం బ్రిడ్జిని కూడా ప్రారంభించామని తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్.. శనివారం (డిసెంబర్ 24) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్‌ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్‌ను స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని, ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు.


బస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలు, చిన్నారులు, నాయకులను సీఎం జగన్ ఆప్యాయంగా పలుకరించారు. అంతకుముందు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ‘పులివెందులను ఆదర్శ నియోజకవర్గం చేయడం కోసం మూడున్నరేళ్లుగా సమున్నత అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే అత్యాధునిక వసతులతో మోడల్ టెర్మినల్ తరహాలో పులివెందులలో బస్ టెర్మినల్ నిర్మించుకున్నాం. ఈ బస్ టెర్మినల్ మిగతా వాటన్నింటికీ రోల్ మోడల్‌గా నిలుస్తుంది’ అని సీఎం జగన్ అన్నారు.


పులివెందులలో బస్ టెర్మినల్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని విమర్శించిన చంద్రబాబుకు ఈ బస్ టెర్మినల్ చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తుందంటూ చురకలు వేశారు సీఎం జగన్. ‘ఈ బస్ టెర్మినల్ చూస్తే వాళ్లకు అసూయ కలుగుతుంది’ అని ఆయన అన్నారు.


‘ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజల తలరాతలు మారుతున్నాయి. సంక్షేమం దిశగా, వివక్ష లేని దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుస్తున్నా. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల తరహాలో అభివృద్ధి జరుగుతున్నా ఎల్లో మీడియా అవేం పట్టనట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ‘చెడిపోయిన వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వీరికి కనపడదు, వినపడదు. తప్పుడు రాతలు రాస్తున్నారు. ఈ తప్పుడు రాతలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అని సీఎం జగన్ సూచించారు.


‘పులివెందుల ప్రజలు నాకు ఇస్తున్న భరోసాతోనే వచ్చే ఎన్నికల్లో మనం 175 స్థానాల్లో విజయం సాధించగలం. ఈ సంకల్పంతో వైఎస్సార్ సీపీ మొక్కవోని దీక్షతో పనిచేస్తోంది’ అంటూ పార్టీ కార్యకర్తలను వైఎస్ జగన్ ఉత్సాహపరిచారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa