ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు తీసుకోండి....రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 08:21 PM

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో మరోసారి ప్రపంచం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వైద్య ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. ఆస్పత్రులో పడకలు, సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, లాజిస్టిక్, మెడికల్ ఆక్సిజన్ సప్లయ్ ఛైన్ వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు.


గతంలో కరోనా కేసులు ముఖ్యంగా రెండో వేవ్‌లో ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆస్పత్రుల్లో పడకలు చాలక, ఆక్సిజన్ కొరతతో తమవారి ప్రాణాలు పోతుంటూ నిస్సహాయులుగా చూస్తు ఉండిపోవడం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి నెలకుంది. ఏదైనా అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేశ్ భూషణ్ శనివారం ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో లేఖ రాశారు.


‘‘27 డిసెంబర్ 2022 మంగళవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య సౌకర్యాల వద్ద (COVID కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేంద్రాలు సహా) మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించాం.. దేశంలోని అన్ని జిల్లాల్లో భౌగోళికంగా అందుబాటులో ఆరోగ్య సౌకర్యాల లభ్యతను కవర్ చేస్తుంది.. పడకల సామర్థ్యం (ఐసోలేషన్ బెడ్‌లు, ఆక్సిజన్-సపోర్టెడ్ ఐసోలేషన్ బెడ్‌లు, ఐసీయూ బెడ్‌లు, వెంటిలేటర్-సపోర్టెడ్ బెడ్‌లు వంటివి) తెలియజేస్తుంది’’ ’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మాక్ డ్రిల్ సందర్భంగా అనుసరించాల్సిన విధి విధానాలను లేఖలో తెలియజేసింది.


ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే పీఎస్‌ఏ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలి. వాటి పనితీరును పరిశీలించడానికి మాక్ డ్రిల్‌ నిర్వహించాలి. ఆసుపత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఆక్సిజన్‌ సిలిండర్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుకోవాలి.


వెంటిలేటర్లు, బైపాప్‌, ఎస్‌పీఓ2 లాంటి ప్రాణాధార వ్యవస్థలు, వాటికి అవసరమైన ఇతర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.


రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ నియంత్రణ గదులను పునఃప్రారంభించాలి. ఆక్సిజన్‌కు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలి.


ప్రతిరోజూ ఆక్సిజన్‌ డిమాండ్‌, వినియోగాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, ఒకవేళ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటే చికిత్సకు అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా మానవ వనరులపై కూడా దృష్టి సారిస్తుంది.


డ్రిల్ సమయంలో తగినంత సంఖ్యలో ఆయుష్ ప్రాక్టీషనర్లు, అంగన్‌వాడీ వర్కర్ల వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్లను కూడా అంచనా వేస్తారు. ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ రోగులను, వైద్య ఆక్సిజన్ సరఫరాను నిర్వహించడానికి సరిగ్గా శిక్షణ పొందారో లేదో కూడా ఈ డ్రిల్ తనిఖీ చేస్తుంది.


ఆర్టీ-పీసీఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్‌లు సులభంగా అందుబాటులో ఉండేలా చూడడం ద్వారా కోవిడ్ పరీక్ష సామర్థ్యాలను పెంచడం కూడా మాక్ డ్రిల్ లక్ష్యం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa