ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండిట్ ల ఆందోళనతో అట్టుడుకుతున్న కశ్మీర్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 08:21 PM

కశ్మీర్ పండిట్ల వేతనాల విషయంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. తమపై తీవ్రవాదులు దాడులకు పాల్పడుతుండటంతో భయాందోళనకు గురవుతున్న పండిట్లు.. జమ్మూకు తరలించాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ విధులకు హాజరుకాబోమని 6 వేల మంది కశ్మీర్ పండిట్ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విధులకు హాజరుకాకుంటే జీతాలు చెల్లించబోమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇటీవల అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలో పండిట్లకు కేంద్ర మంత్రి, బీజేపీ నేత జితేందర్ సింగ్ మద్దతు ప్రకటించారు


కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను కేంద్రం రద్దుచేసిన తర్వాత ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాథి పథకం కింద లోయకు తిరిగొచ్చిన పండిట్లు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కశ్మీరీ పండిట్ల డిమాండ్‌కు మద్దతుగా ప్రకటన చేసిన డాక్టర్ జితేందర్ సింగ్... బెదిరింపులను ఎదుర్కొంటున్న వ్యక్తులను రక్షించడానికి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయడాన్ని తాను సమర్దిస్తానని అన్నారు. ‘ఒకరి ప్రాణానికి ముప్పు ఉంటే ఒక డజను కార్యాలయాలను మూసివేయడం మంచిదని నేను చెబుతాను.. ఒక ప్రాణాన్ని కాపాడటం అంతకంటే ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు ఇదే అంశంపై బీజేపీ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, దిలీప్ సకాయ్‌లు శనివారం జమ్మూకు వెళ్లి ఆందోళన చేస్తున్న పండిట్లను కలిసి.. వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.


‘‘ఆగస్టు 31 వరకూ వేతనాలు చెల్లించాం.. ఇంటి దగ్గర కూర్చుంటే జీతాలు ఇచ్చేది లేదు.. ఇది స్పష్టంగా చెబుతున్నాను.. ఈ విషయంలో మొహమాటం లేదు.. వాళ్లు (పండిట్ ఉద్యోగులు) ఈ మాటలు విని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని మనోజ్ సిన్హా అన్నారు. గవర్నర్ వ్యాఖ్యలకు నిరసనగా అనేక మంది కశ్మీరీ పండిట్లు మరియు రిజర్వ్ కేటగిరీ ఉద్యోగులు జమ్మూలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల ఆందోళనలు తీవ్రతరం చేశారు.


ఉగ్రవాదుల లక్షిత దాడుల తర్వాత కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన వారిని ప్రభుత్వం లోయలో పని చేయమని బలవంతం చేస్తే వారిని బలి పశువులుగా మార్చడానికి తాము అనుమతించబోమని జమ్మూ కశ్మీర్‌లోని స్థానిక బిజెపి నాయకత్వం తెలిపింది. గవర్నర్ మనోజ్ సిన్హాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని, నిరసన చేస్తున్న ఉద్యోగులను ఒకసారి కలవాలని కోరారు. గవర్నర్‌కు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి అధికారులు వివరించనట్టుందని వ్యాఖ్యానించారు.


పండిట్ నేత డాక్టర్ అగ్నిశేఖర్ మాట్లాడుతూ.. పండిట్ ఉద్యోగులపై లక్ష్యంగా దాడులు, తాజా ఉగ్రవాద బెదిరింపులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పండిట్లను బలి పశువులగా వాడుకుంటోందని ఆరోపించారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తన కూతురిని కశ్మీర్‌లో ఉంచాలని కోరుకుంటారా? ఏ డిప్యూటీ కమీషనర్ అయినా కశ్మీర్‌లో భద్రత లేకుండా తిరుగుతారా? అని అగ్నిశేఖర్ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa