తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంచడం దారుణమని బిజెపి రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా ఆక్షేపించారు. భక్తులకు అనువైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టిటిడి తన ఆదాయ వనరు పెంచుకోవడంపైనే దృష్టి సారించడం బాధాకర విషయమని వెల్లడించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. నారాయణగిరి రెస్ట్ హౌస్లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700కు పెంచారని, రెస్ట్హౌస్ 4లో ఒక్కో గదికి ప్రస్తుతం రూ. 750 వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని 1,700కు పెంచారని ఆయన పేర్కొన్నారు. ఈ అద్దెల పెంపు భక్తులపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని ఆయన వెల్లడించారు. అద్దెలు కాలానుగుణంగా పెంచుకోవచ్చని, కానీ పెంపుదల అన్నది భక్తులకు సౌకర్యార్థంగా, వారు ఆర్థికంగా భరించేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు వసతి గృహాల అద్దెతోపాటు అంతే మొత్తంలో డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుందని, అంటే ఒకవేళ రూ. 1,700 గదిని అద్దెకు తీసుకుంటే అంతే మొత్తంలో డిపాజిట్ అంటే మరో రూ.1700 కలిపి మొత్తం రూ. 3,400ను చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధన ఎంతవరకు సహేతుకమో టీటీడీ పునరాలోచన చేయాలని ఆయన కోరారు. టీటీడీ ఏ నిర్ణయం తీసుకున్న భక్తుల సౌకర్యార్థంగా ఉండాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa