ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ ను కలసిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 05:32 PM

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. దీంతో కర్నూలు జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడు చల్లా భగీరథ్‌రెడ్డి మరణం తర్వాత చల్లా కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. దీంతో సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 1న అవుకులోని చల్లా వ్యవసాయ క్షేత్రంలో చల్లా రామకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.


ఆ సమయంలో భగీరథ్‌రెడ్డి భార్య శ్రీలక్ష్మి, చల్లా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిల సమక్షంలో చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రామకృష్ణారెడ్డి సతీమణి శ్రీదేవి, సోదరులు సూర్యప్రకాశ్‌రెడ్డి, అవుకు ఎంపీపీ చల్లా రాజశేఖరరెడ్డిలు ఉన్నారు.


అవుకులోని చల్లా ఫామ్ హౌస్‌లో చల్లా రామకృష్ణారెడ్డి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై జెడ్పీటీసీ సభ్యురాలు, దివంగత భగీరథరెడ్డి సతీమణి శ్రీలక్ష్మి గుర్రుగా ఉన్నారు. ఆ వెంటనే సీఎంను ఆమె కలిశారు. ఆమెకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ కేటాయించిన సంగతి తెలిసిందే. అవుకులోని చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విబేధాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ నేతగా కొనసాగారు. ఎమ్మెల్యేగా గెలిచారు.. 2014 టీడీపీలో చేరారు.. తనకు టికెట్ రాకపోయినా సరే టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఏపీ సివిల్‌ సప్లైస్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు దక్కాయి. 2019 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీ (YSRCP)లో చేరగా.. జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2021లో రామకృష్ణారెడ్డి కరోనాతో చనిపోవడంతో.. ఆయన కుమారుడు భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఆయన కూడా ఇటీవల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత విభేదాల మొదలయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa