ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత 2019 ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 05:31 PM

మాజీ మంత్రి, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో పోటీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి పరిణామాలను వివరించారు. తల్లిదండ్రలు రాజకీయాల్లో ఉన్నారు.. నియోజకవర్గంతో అటాచ్‌మెంట్ ఉంది.. సిస్టంలో ఉండాలి కదా అని చాలామంది తనతో అన్నారని వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు. రాజకీయాలపై తన కుమారుడికి ఇంట్రెస్ట్ ఉందని తెలిశాక.. భవిష్యత్‌కు అవకాశం మన ద్వారా జరిగితే బావుంటుంది అనుకున్నట్లు వివరించారు.


బీజేపీలో ఉన్నా కూడా నియోజకవర్గంలో చూస్తే.. టీడీపీలో ఛాన్స్ లేదన్నారు. చంద్రబాబుతో విభేదాలు గతంలో ఉన్నా.. ఇప్పుడు లేవు అన్నారు. ఆయన ఒప్పుకోలేరు కాబట్టి వైఎస్సార్‌సీపీ వైపు అడుగులు వేసినట్లు చెప్పారు. వాళ్లు పిలిచినప్పుడు .. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆరు నెలల ముందే చెప్పానని.. 130 సీట్లు దాటతాయని చెప్పానన్నారు. స్థానికంగా జనాలకు సంబంధించి వాతావరణం చూశాక.. తానురాను, వాళ్లనే వెళ్లమని అని చెప్పానన్నారు.


ఆ తర్వాత ఎన్నికలకు ముందు అమెరికన్ సిటిజన్‌షిప్ రద్దు కాలేదని వివరించారు. ఆ సందర్భంలో తాను పోటీ చేయాల్సి వచ్చిందని.. ఓ ఏడాది తర్వాత తాను రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే కుమారుడితో పోటీ చేయిస్తానని అప్పుడు అధిష్టానంతో చెప్పానన్నారు. కాదు, కాదు ఈసారికి ఉండాల్సిందే అన్నారని.. గతంలో ఎప్పుడూ డబ్బులు పెట్టనటువంటి వాడిని డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. తన నియోజకవర్గంలో తాను ఓడిపోయానని.. ఒక విధంగా చాలా మంచి జరిగిందని చెప్పాలన్నారు.


తాను వైఎస్సార్‌సీపీకి వెళ్లే కమ్రంలో తన వల్ల పురందేశ్వరి రాజకీయాలు వదులుకోవాల్సి వచ్చింది అన్నారు. తాను వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన సమయంలో బీజేపీకి రాజీనామా చేసి లెటర్ ఇచ్చారని.. అమిత్ షా వెంటనే 'మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు' అని చెప్పి.. ఆ లేఖను చించేశారని.. తాము అభ్యంతరం చెప్పం అన్నారన్నారు. ఇక్కడ కూడా జగన్‌తో అదే చెప్పానని.. పురందేశ్వరి బీజేపీలో ఉంటే తమకేం ఇబ్బంది లేదని తనతో చెప్పారన్నారు. తన కుమారుడి కోసం వెళ్లాల్సి వచ్చిందని.. ఒకరి మీద కోపంతో అలా వెళ్లలేదన్నారు. దీని గురించి బయట వాళ్లు పదిరకాలుగా విశ్లేషించుకున్నారన్నారు. వాస్తవానికి ఇదంతా జరిగిందని వివరించారు. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందానని వెంకటేశ్వరరావు కామెంట్ చేశారు. అందుకే ఇక తమ కుటుంబంలో తాను, తన కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇమడలేమని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజాసేవ చేయాలనుకుంటే ఎటువంటి పదవులు లేకపోయినా అవకాశం ఉన్న మేరకు సొంతంగా చేస్తాను అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa