రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను పెంపుదలకు సంబంధించి లారీ యజమానుల సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. లారీ యజమానుల సంఘం నుంచి వచ్చిన సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తామన్నారు. కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతృత్వంలో మంగళవారం విజయవాడలో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథి విశ్వరూప్ ఈ సందర్భంగా రవాణా రంగాన్ని కలవరపెడుతున్న జీఓ ఎంఎస్ నెంబర్ 1 పై స్పందించారు. త్రైమాసిక పన్ను పెంపుపై లారీ యజమానుల నుంచి వస్తున్న స్పందనను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. లారీ యజమానుల సంఘాలను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకోబోమని, ఉభయులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలనే తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జూన్ నాటికి రోడ్లను బాగు చేస్తామని తెలిపారు. ఎంత ఖర్చు అయినా సరే రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత శాఖలకు సీఎం చెప్పారన్నారు. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా విజయవంతం కాలేకపోతున్నామని తెలిపారు. ప్రమాదాలను పూర్తిగా డ్రైవర్ల తప్పిదాలుగానే భావించటానికి వీల్లేదన్నారు. అనుకోని సంఘటనల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa