ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సంపూర్ణంగా అమలు జరగాల్సి ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎవరైనా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని ఆయన అన్నారు. వివక్షకు గురయ్యే కులాలను మనం అర్థం చేసుకోవాలన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమన్నారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.
సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్లో కేటాయింపులు జరగాలని అభిప్రాయపడ్డారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సంపూర్ణంగా అమలు జరగాల్సి ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ దారి మళ్లించకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులనే ముందుగా కనిపెట్టాలని.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే తన తపన అని అన్నారు. నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa