ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీతా, రామా విగ్రహా కోసం...నేపాల్ నుంచి రాతి తరలింపు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:22 PM

అయోధ్యలో రామ మందిరం నిర్మాణ  పనులు  శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో రామ మందిరం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. భవ్య రాముడి ఆలయాన్ని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ దిశగా పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ ఆలయంలో 3 అడుగుల పొడవైన రాముడి విగ్రహాన్ని, సీతాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాలను రూపొందించేందుకు ఉపయోగించే రాతిని నేపాల్ నుంచి తీసుకొస్తున్నారు. నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి శాలిగ్రామ్ రాళ్లను భారత్ పంపించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రెండు రాళ్లతో కూడిన భారీ ట్రక్కులు ఆదివారం (జనవరి 29) భారత్‌కు బయల్దేరాయి.


ఈ ట్రక్కులు బయల్దేరడానికి ముందు నేపాల్‌లోని భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి పూజలు చేశారు. పవిత్రమైన ఆ రాళ్లను తాకి భక్తితో పరవశించిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ శాలిగ్రామ్ రాళ్ల నుంచి శ్రీరాముడు, జానకి విగ్రహాలను శిల్పులు చెక్కుతారు. అయోధ్య రామమందిరంలోని ప్రధాన ఆలయ సముదాయంలో ఈ విగ్రహాలను కొలువుదీరుస్తారు. జానకీ రాముల విగ్రహాలను రూపొందించనున్న రెండు రాళ్లు వరుసగా 23, 15 టన్నుల బరువు ఉంటాయని తెలుస్తోంది.


నేపాల్‌లోని గంకీ రాష్ట్రంలోని ముస్తాంగ్ జిల్లాలో ‘కలిగండకి’ నది నుంచి సేకరించిన శాలిగ్రామ్ రాళ్లకు విశిష్టత ఉంది. జానకీ మాత ఇక్కడే జన్మించిందని కోట్లాది మంది హిందువుల విశ్వాసం. జనక్‌పూర్‌లో జానకి మాత ఆలయం ఉంది. నేపాల్‌లోని గంకీ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ శాలిగ్రామ్ రాళ్లను ఈ ఆలయానికి అప్పగించింది. నేపాల్ మాజీ డిప్యూటీ ప్రధాన మంత్రి, నేపాలీ కాంగ్రెస్ లీడర్ బిమలేంద్ర నిధి ఈ శిలలను భారత్‌కు పంపించేందుకు స్వయంగా బాధ్యత తీసుకున్నారు. జనక్‌పూర్‌లోని జానకీ ఆలయ అధికారులతో కో-ఆర్డినేట్ చేస్తున్నారు. జనక్‌పూర్ ఆయన స్వస్థలం.


‘కలి గండకి నదిలో లభించిన ఈ శిలలు ఎంతో పవిత్రమైనవి. ఈ శిలలను విష్ణు భగవానుడికి ప్రతిరూపాలుగా భావిస్తారు. విష్ణువు 10 అవతారాల్లో శ్రీరాముడు ఒక అవతారం. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసే విగ్రహాల కోసం ఈ రాళ్లను ఉపయోగించాలని నిర్ణయించారు. రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు మేం ఈ శిలలను పంపిస్తున్నాం’ అని బిమలేంద్ర నిధి చెప్పారు. ఆయన గతంలోనే అయోధ్యకు వచ్చి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, అక్కడి మునులతో భేటీ అయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa