సీఎం జగన్ నివాసానికి దగ్గరలో కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే వ్యక్తి గంజాయి మత్తు లో అతి కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లి మనోహరం మాట్లాడుతూ.... తన కుమార్తెను అన్యాయంగా చంపేశాడంటూ కన్నీటి పర్యంతమైంది. కళ్లు కనిపించవనే కనికరం కూడా చూపలేదని వాపోయింది. వివరాల్లోకి వెళ్ళితే.... కంటి చూపులేని రాణి ఇంట్లోనే ఉంటుండగా తల్లి కూలిపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న రాజు అనే యువకుడు... యువతిపై కన్నేశాడు. అప్పుడప్పుడూ యువతి ఇంటికి వచ్చి మాట్లాడుతుండటంతో స్థానికులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటం... పైగా అంథురాలు కావడంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రాజు వేధింపులు క్రమక్రమంగా పెరగడంతో ఈ విషయాన్ని యువతి తన తల్లికి, పెద్దమ్మకు చెప్పింది. దీంతో రాజును యువతి తల్లి నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాణిపై రాజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న యువకుడు అక్కడే ఉన్న గొడ్డలితో రాణిపై దాడి చేసి నరికాడు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. కళ్లు కనిపించని తమ బిడ్డని చంపిన రాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa