ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది నందమూరి తారకరత్న కోరిక. ఆ కోెరిక నెరవేరకుండానే ఆయన అనంతలోకాలకు వెళ్లిపోయారు. మరోవైపు నందమూరి తారకరత్న 39 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూయడం అందర్నీ శోకసంద్రంలో ముంచెత్తుతోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వస్తున్నట్లు తారకరత్న ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మరణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తారకరత్న ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. తెలుగు దేశం పార్టీలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులను కలుసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
తారకరత్న రాజకీయంగా ఓవైపు యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యేగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. దివంగత ఎన్టీ రామారావు జన్మించిన నిమ్మకూరు గ్రామం, గుడివాడ శాసనసభ స్థానంలో ఉండటంతో.. అక్కడి నుంచి నందమూరి వారసుడైన తారకరత్నను పోటీకి దింపడం ద్వారా టీడీపీకి, చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా ఉన్న కొడాలి నానికి చెక్ పెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే తారకరత్న గత నెలలో కృష్ణా జిల్లాలో జోరుగా పర్యటించారు.
అలాగే, నందమూరి కుటుంబానికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తారకరత్న పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. 1983 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఎన్టీఆర్ రెండు సార్లు, హరికృష్ణ ఒకసారి, బాలకృష్ణ రెండుసార్లు ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలోనే గత నెలలో తారకరత్న హిందూపురంలో విస్తృతంగా పర్యటించారు. బాలకృష్ణ ఎంతగానో ప్రేమించే తారకత్న హిందూపురంలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని స్పష్టంగా చెప్పిన తారకరత్న.. రాజకీయంగా అత్యంత బిజీగా మారుతున్న తరుణంలోనే.. జనవరి 26న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 23 రోజుల పాటు ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడిన తారకరత్న.. చివరికి కన్నుమూయడం అందర్నీ శోకసంద్రంలో ముంచేసింది. రాజకీయంగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ.. ఎంతో భవిష్యత్తు ఉన్న నేత అర్ధంతరంగా కన్నుమూయడంపై అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa