అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పి.ఎల్.పురంలో ఘోరమైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... పడాలవారి లక్ష్మీపురం (పి.ఎల్.పురం) గ్రామానికి చెందిన వడ్లమూరి నాగేంద్ర (21) అనే దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన రైతు మేడిశెట్టి సూర్యనారాయణ (దివాణం) వద్ద సుమారు నాలుగేళ్ల నుంచి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అవివాహితుడైన నాగేంద్ర... తల్లి మరియమ్మతో కలిసి ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాగేంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం ఉదయం నిద్రలేచిన తల్లి మరియమ్మ.. కుమారుడు కనిపించకపోవడంతో తన కుమార్తెలు, బంధువులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టింది. పది గంటల సమయంలో సూర్యనారాయణకు చెందిన వ్యవసాయ బావి వద్ద సెల్ఫోన్, చెప్పులు, టవల్ కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. బావిలోకి చూడగా నాగేంద్ర కాళ్లు, చేతులు కట్టేసి నీటిలో శవమై కనిపించాడు. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీంను రప్పించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి సీహెచ్సీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అప్పలరాజు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa