మహిళా దినోత్సవ రోజున దేశవ్యాప్తంగా అతివల గొప్పతనాన్ని అభినందిస్తూ సత్కరిస్తున్న వేళ ఓ కామాంధుడు ఇంటిపక్కనే ఉన్న వివాహితపై కోరిక తీర్చాలంటూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై పశువులా విరుచుకుపడ్డాడు. ఆ మృగాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించిన క్రమంలో దాడికి పాల్పడ్డాడు. రక్తం వచ్చేలా తలపై గాయపరిచాడు. వీధిలోకి పరుగుతీసినా వదలక వెంబడించాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా, రాజాం మండలం వీఆర్ అగ్రహారంలోని ఎస్సీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. గురువారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ పి.నీలావతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీఆర్అగ్రహారం ఎస్సీ కాలనీకి చెందిన గెడ్డాపు మోహనరావు ఇంటిపక్కనే ఉన్న వివాహితపై కన్నేశాడు. కొన్నాళుగా మానసికంగా ఆమెను వేధిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మరింతగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. తట్టుకోలేని ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో ఆయన పలుమార్లు మోహనరావును మందలించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈనెల 8న ఉదయం బాధిత మహిళ ఒక్కరే ఇంట్లో ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వచ్చి తన కోరికను బయటపెట్టాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నంలో జుట్టు పట్టుకుని కాలితో తన్ని గోడకు తలను మోదాడు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. అతనితో పెనుగులాడిన ఆమె ఇంట్లో నుంచి బయటపడి వీధిలోని పాఠశాల సమీపానికి చేరుకుంది. అక్కడ బోరున ఏడ్వడంతో కాలనీవాసులంతా చేరి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆమెను ఓదార్చారు. ఘటన తర్వాత మోహనరావు పరారీలో ఉన్నాడు. పోలీసులు లోతుగా ఆరాతీసి పట్టుకున్నారు. అనంతరం గురువారం సాయంత్రం కోర్టుకు తరలించగా రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించిందని ఎస్ఐ నీలావతి తెలిపారు. బాధిత మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa