ఇటీవల విమానాల్లో విచిత్ర ప్రయాణికుల ప్రవర్తనతో సిబ్బందితోపాటు ఇతర ప్రయాణికులకు సవాల్ గా మారుతోంది. ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతిమించుతోంది. కొద్ది నెలలుగా తరుచుగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, మరోసారి ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. బాత్రూమ్లో సిగరెట్ తాగొద్దన్నందుకు క్యాబిన్ సిబ్బందిపై చిందులేసిన ఓ ప్రయాణికుడు.. రచ్చరచ్చ చేశాడు. అంతటితో ఆగకుండా విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన లండన్-ముంబయి ఎయిరిండియా విమానంలో శనివారం చోటుచేసుకుంది.
లండన్-ముంబయి ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన అమెరికా పౌరుడు రమాకాంత్ (37) బాత్రూమ్లో సిగరెట్ తాగుతుండగా.. క్యాబిన్ సిబ్బంది వద్దని వారించారు. దీంతో రెచ్చిపోయిన అతడు సిబ్బందిపై నోరుపారేసుకున్నాడు. తమతో వాగ్వాదానికి దిగిన నిందితుడు విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించినట్టు క్యాబిన్ క్రూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తన బ్యాగులో బుల్లెట్ కూడా ఉందని బెదిరించాడు. అయితే, తనిఖీల్లో ఎటువంటి అనుమానిత వస్తువులు అతడి బ్యాగులో లభ్యం కాలేదు.
ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడు రమాకాంత్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం సేవించి ఉన్నాడా లేదా మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా? అనేది తెలుసుకోడానికి నిందితుడు నమూనాలను పరీక్షల కోసం పంపినట్టు ముంబయిలోని సహర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలైన ఓ వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనలో ఎయిరిండియా వ్యవహరించిన తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
విమర్శలతో దిగి వచ్చిన ఎయిరిండియా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సిబ్బంది వాటిని అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. ప్రయాణికులెవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఆ విషయాన్ని అధికారులకు నివేదించాలని సంస్థ సీఈవో క్యాంబెల్ విల్సన్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa