ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఎంపీ లకు కేంద్ర ప్రభుత్వం షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 12:39 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యం కాదని లోక్‌సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. నిధుల పంపిణీలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం ఎటువంటి వ్యత్యాసం చూపించలేదని తెలిపింది. తద్వారా ఈ అంశం ముగిసిన అధ్యాయం అయిందని స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఏపీతో సహా పలు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు అందాయని గుర్తుచేశారు. పన్నుల పంపిణీలో 14వ ఆర్థిక సంఘం సాధారణ, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు వ్యత్యాసం చూపించలేదని, దాని సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పంపిణీని 32శాతం నుంచి 42శాతానికి పెంచామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నులు పంపిణీ చేయాలని సిఫారసు చేసిందన్నారు. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వనరుల వ్యత్యాసాన్ని సాధ్యమైనంత మేర పన్నుల పంపిణీ రూపంలో పూడ్చగలిగామన్నారు. అయితే, 2015-16 నుంచి 2019-20 మధ్యకాలానికి గాను ఏపీకి ప్రత్యేక సహకారం అందించడానికి అంగీకరించామని, అందులో భాగంగా విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుల రుణాలకు వడ్డీ చెల్లింపు కోసం 2018-19లో రూ.15.81 కోట్లు విడుదల చేశామని వివరించారు. అలాగే, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అమలు చేశామని, మిగిలిన అంశాల అమలు ఆయా దశల్లో ఉందని తెలిపారు. కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటుకు చట్టం పదేళ్ల సమయం కల్పించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa