ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై మంత్రులకే సలహాదారులు,,,మార్గదర్శకాలను కోర్టు ముందుంచిన సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 07:29 PM

సలహాదారుల నియామకానికి సంబంధించి.. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 630ని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్‌కే రాజశేఖరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ విశ్రాంత ఉద్యోగి ఎస్‌.మునెయ్య హైకోర్టులో మరో పిల్‌ వేశారు.


వీటి విచారణ సందర్భంగా సలహాదారుల నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. శాఖలకు సలహాదారులేమిటంటూ నిలదీసింది. వారి నియామక నిబంధనలు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. వారి నియామకం సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అదనపు అఫిడవిట్‌ వేశారు.


ఆయా సబ్జెక్టులో నైపుణ్యం ఆధారంగా సంబంధిత మంత్రులకు సలహాదారులు, ప్రత్యేక సలహాదారులను నియమిస్తామని ప్రభుత్వం వివరించింది. సలహాదారులను నియమించుకోవాలని మంత్రులు భావిస్తే.. ముఖ్యమంత్రి ఆమోదం పొందాలని.. సలహాదారుల పదవీ కాలపరిమితి రెండేళ్లు ఉంటుందని తెలిపింది. పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు పొడిగించవచ్చని స్పష్టం చేసింది. సలహాదారుల నియామకం అవసరం.. తగిన వ్యక్తా? కాదా తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష ఉంటుందని కోర్టుకు వివరించింది.


ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేయబోమని ప్రతి సలహాదారు అఫిడవిట్‌పై సంతకం చేయాలని.. ఎలాంటి వివరాలు గోప్యంగా ఉంచాలో అఫిడవిట్‌లో ఉంటాయని వివరించింది. విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలివ్వడం వరకే సలహాదారుల పాత్ర పరిమితమని స్పష్టం చేసింది. సివిల్‌ సర్వెంట్ల రోజువారీ కార్యకలాపాల్లో సలహాదారులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని.. 2022లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవో 36కు అనుగుణంగా జీతభత్యాల చెల్లింపు ఉంటుందని న్యాయస్థానానికి వివరించింది.


సలహాదారుల నియామకం విషయంలో గతంలో మాదిరి కన్సల్టెంట్స్‌, కన్సల్టింగ్‌ ఏజెన్సీలను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు తెలిపింది. ఇప్పటికే కొనసాగుతున్న సలహాదారులను సంబంధిత మంత్రులకు సలహాదారులుగా రీడిజిగ్నేట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏ బాధ్యతలు నిర్దేశించని సలహాదారులకు నిర్దుష్ట పాత్ర, బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వముందని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్నవారికి సైతం ఇవే నియమ నిబంధనలు వర్తిస్తాయని కోర్టు వివరించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa