వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని ఫిక్కీ ఏపీ చైర్మన్, నూజివీడు సీడ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మండవ ప్రభాకరరావు అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ‘వాల్మార్ట్’ ఆధ్వర్యంలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపుపై ఏర్పాటుచేసిన సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభాకరరావు మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు అధిక ధరలు లభించేలా ఫిక్కీ ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వాల్మార్ట్ కూడా రైతుల ప్రయోజనాల కోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు రైతులు అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకు వాల్మార్ట్తోపాటు ఫిక్కీ తోడ్పాటునందిస్తుందన్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2016 నుంచి రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటుచేసి వారికి అన్నిరకాల సహాయం అందిస్తున్నామన్నారు. ఈ సంఘాల నిర్వహణ అనేక సవాళ్లతో కూడుకున్నదని పేర్కొంటూ సమష్టిగా పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు. వాల్మాల్ట్ వైస్ ప్రెసిడెంట్ కేథలిన్ మెక్ లాఫ్లిన్ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో ఒక మిలియన్ చిన్న రైతులకు పలు రకాలుగా సాయం చేయాలని సంస్థ నిర్ణయించిందన్నారు. అందులో సగం మంది మహిళా రైతులు ఉండేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa