ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాపై అక్రమంగా కేసులు పెట్టారు...చంద్రబాబును కలిసి వైసీపీ రెబల్ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 07:55 PM

ఏపీలో అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్‌సీపీ అసమ్మతి నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కలిశారు. వైఎస్సార్‌సీపీ నేతలు తనను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గుప్తాను ఒంగోలు తాలూకా పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత వారమే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. గుప్తా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు రాకేష్‌‌తో కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్లారు.


వైఎస్సార్‌సీపీ నేతలు తనపై కక్షగట్టి కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబుకు వివరించారు. ఇటీవల తనను కొందరు పోలీసులు, కిందిస్థాయి సిబ్బంది కలిసి కుట్రపూరితంగా తన వాహనంలో గంజాయి పెట్టి అరెస్టు చేసి జైలకు పంపారన్నారు. భయపడొద్దు.. తాము అండగా ఉంటామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్లు సుబ్బారావు గుప్తా చెప్పారు.


సోమిశెట్టి సుబ్బారావు గుప్తా వైఎస్సార్‌సీపీ కార్యకర్త. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుచరుడిగా ఉండేవారు. అయితే బాలినేని బర్త్ డే వేడుకల్లో గుప్తా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. సొంత పార్టీ నేతల తీరు సరిగా లేదని.. పద్దతి మార్చుకోవాలని చెప్పారు. సుబ్బారావు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ వెంటనే అతడి ఇంటిపై దాడి జరగడంతో భయపడ్డాడు.. నేరుగా వెళ్లి గుంటూరులోని ఓ లాడ్జిలో ఉన్నాడు.


లాడ్జిలో గుప్తా ఉన్నాడని తెలుసుకున్న ఒంగోలుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుభానీ వెళ్లారు. గదిలో ఉన్న సుబ్బారావుపై దాడి చేసి.. బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన తర్వాత పోలీసులు సుభానీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గుప్తా కూడా వెంటనే వెళ్లి బాలినేనిని కలిశారు.. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగిందని భావించారు. కానీ సుబ్బారావు మాత్రం సొంత పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అక్కడితో ఆగకుండా ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు.. తనకు రక్షణ కల్పించాలని కోరారు. హస్తినలోనే ఎంపీ రఘురామను కలవడం చర్చనీయాంశమైంది.


సుబ్బారావు గుప్తాపై కొద్ది రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇంతలో ఇటీవల ఒంగోలు మంగమ్మ కాలేజీ దగ్గర సుబ్బారావు దగ్గర పోలీసులు గంజాయి ఉందని అరెస్ట్ చేశారు. అతడికి కోర్టు రిమాండ్ విధించగా.. జైల్లో ఉన్నారు. గతవారం బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ వాణిజ్య విభాగం సుబ్బారావుకు మద్దతు తెలిపింది.. తనపై అక్రమంగా గంజాయి కేసును బనాయించారంటున్నారు గుప్తా. త్వరలోనే ఈ కుట్రను బయటపెడతాను అన్నారు. తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa