ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో విడత ఆసరా పథకం నిధుల విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 09:35 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించిన సీఎం జగన్.. ఆసరా పథకం ద్వారా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళల ఖాతాల్లో రూ. 6,419.89 కోట్లు జమ చేశారు. ప్రస్తుతం అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటి వరకు జగన్‌ ప్రభుత్వం రూ. 19,178 కోట్ల సాయం అందించింది.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు ప్రభుత్వ పరంగా అండదండలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంల ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదన్నారు. ఈ మొత్తం డబ్బును ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టానని వెల్లడించారు. ఒక్క ఆసరా పథకం కింద ఇప్పటి వరకు అక్షరాలా రూ.19,178 కోట్లు ఇచ్చామని వివరించారు. మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. ఈ ప్రభుత్వం నిలబడుతోందన్నారు.


వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించామని సీఎం జగన్ తెలిపారు. ఈ డబ్బుతో 9 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా రూ. 4,355 కోట్లు వారికి అనుసంధానం చేశామన్నారు.


గత చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించి సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14 వేల కోట్లు అయితే, ఇప్పుడు బ్యాంకుల ద్వారా ఏటా రూ. 30 వేల కోట్లు సగటున అందుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. 99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ పొందుపు సంఘాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయని చెప్పారు.


అందుకే బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించామని వివరించారు. ఇంకా తగ్గించేలా బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నాని పేర్కొన్నారు. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుందన్నారు. ఎన్‌పీఏలు, ఓవర్‌ డ్యూలు కేవలం 0.45 శాతం మాత్రమే ఉన్నాయని.. అదే, గత ప్రభుత్వం హయాంలో అయితే 18.36 శాతంగా ఉండేవని తెలిపారు. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారని.. కానీ, వారిని నిలువునా ముంచేశారన్నారు. 2016 అక్టోబర్ నుంచి కూడా సున్నా వడ్డీ రుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారని ఆరోపించారు. దీంతో రూ. 3 వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు.


అందుకే తిరిగి సున్నా వడ్డీ కింద రుణాలు వచ్చే పరిస్థితిని తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. 2016 అక్టోబర్‌లో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3,600 కోట్లు చెల్లించామని.. ఇదంతా చిక్కటి చిరునవ్వుతోనే చేశామన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.2,25,330.76 కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చామని పేర్కొన్నారు.


ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం అని సీఎం జగన్ చెప్పారు. మహిళా సాధికారితే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చానని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నానని తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa