వైసీపీలో చాలా మంది లోలోపల ఉడికిపోతున్నారని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. మరో పార్టీలో చేరిక కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే బయటికి వస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
2024 ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు సైతం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందని జోస్యం చెప్పారు. 2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని.. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమే స్పష్టమైన ప్రజా తీర్పు అని వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలనే తపన ఉన్న తాను.. విసిగి వేసారి చివరికి గట్టిగా మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. చివరికి పార్టీ (వైసీపీ)కి విధేయుడిగా ఉన్న తనపైనే నిఘా పెట్టారన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే అనుమానించారని.. పరిష్కరించకుండా రాజకీయ కోణంలో ఆలోచించారని చెప్పారు. అందుకే రెండు నెలల క్రితమే వైసీపీకి దూరమయ్యానని వెల్లడించారు. ఇక, ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తానని ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయగా.. వారిలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa