ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ 5 జోన్ గెజిట్‌‌ పై కోర్టులో సవాల్ చేసిన అమరావతి రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 04:58 PM

వైసీపీ సర్కార్ పై  అమరావతి రైతులు తమ పోరును కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు ఏపీ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 21న జారీ చేసిన గెజిట్‌పై హైకోర్టును ఆశ్రయించారు. జగన్ సర్కార్ రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుకు సంబంధించి గెజిట్‌(337) నోటిఫికేష‌న్‌ను వారం క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గెజిట్‌ను సవాల్ చేస్తూ అమరావతి రైతుల తరపున గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన ఆవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌‌తో పాటూ స్థానికంగా ఉన్న పలువురు అధికారుల్ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.


ఏపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో జీవో 107 జారీ చేసిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలు, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో.. రాజధాని కోసం సమీకరించిన 1251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ఈ జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జోనల్ రెగ్యులేషన్‌కు ఈ ఉత్తర్వులు విరుద్ధమని.. జోనల్‌ పరిధిని కుదించడమే అన్నారు. రాజకీయ అజెండాలో భాగంగా రాజధాని ప్రాంతానికి చెందనివారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్‌డీఏ సవరణ చట్టం(యాక్ట్‌ 13) తీసుకొచ్చిందన్నారు.


ఇప్పటికే దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దగ్గర ఉన్నాయన్నారు. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేప్పుడు.. జీవో 107ను సవాల్ చేస్తూ దాఖలైన పాత కేసుకు కలపానలి ప్రభుత్వం కోరిందన్నారు. దీంతో అవన్నీ త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరాయని.. ఇప్పుడు దీనిని అవకాశంగా తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుత గెజిట్‌ను జారీ చేసింది అని పిటిషన్‌లో ప్రస్తావించారు. సీఆర్డీఏ స్థానిక ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు.


ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై స్థానికుల నుంచి ఎలాంటి అభ్యర్థనలు రాకపోయినా.. ప్రత్యేక అధికారి సీఆర్‌డీఏకు ప్రతిపాదన చేశారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని గెజిట్‌ నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రధానంగా కోరారు. వెంటనే దానిని రద్దు చేయాలని.. అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.


ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ.. గెజిట్‌ ఇచ్చింది. మంగళగిరి మండలం నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం.. అలాగే తుళ్లూరు మండలంలోని ఐనవోలు, మందడం పరిధిలో ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై గతేడాది ప్రభుత్వ జీవో రాగా.. రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa