ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క ఆలోచన ఆ గ్రామాన్ని మార్చేంది

national |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 09:09 PM

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నది అన్నది నిన్నటి మాట. ఒక్క ఆలోచన ఏకంగా గ్రామాన్నే మార్చేస్తుందన్నది నేటి ట్రెండ్. 


 పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు మారుమూల ప్రాంతంలోని ఓ కుగ్రామం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఆ గ్రామస్థులంతా సమష్టిగా ఈ ఉద్యమంలో పాల్గొని కేవలం 15 రోజుల్లోనే గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేసి.. చుట్టుపక్కలవారికి మార్గదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పథకం కాకపోయినా గ్రామ పంచాయతీ ప్లాస్టిక్‌‌పై పోరులో విజయం సాధించడంతో అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని ఓ కుగ్రామం ‘ప్లాస్టిక్‌ ఇవ్వు.. బంగారం తీసుకో’ అనే నినాదంతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో 15 రోజుల్లోనే ఆ గ్రామం ప్లాస్టిక్‌ రహితంగా మారిపోయింది.


అనంతనాగ్‌ జిల్లాలోని హిల్లర్‌ షాబాద్‌ బ్లాక్‌లో సాదివార ఈ ఘనత సాధించింది. పర్యావరణ పరిరక్షణకు సాదివార గ్రామ పంచాయతీ సర్పంచి ఫారూక్‌ అహ్మద్‌ గనాయ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఫారూక్‌.. ప్లాస్టిక్‌ను ఎలాగైనా తమ గ్రామం నుంచి తరిమేయాలని సంకల్పించారు. దీంతో ప్లాస్టిక్‌ తెచ్చివ్వండి.. బంగారం తీసుకెళ్లండంటూ గ్రామస్థులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 20 క్వింటాళ్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసుకొస్తే ఒక బంగారు నాణెం ఇస్తానని సర్పంచ్ ప్రకటించారు. తాను నిర్దేశించిన మొత్తంలో ప్లాస్టిక్‌ తీసుకొచ్చినవారికి బంగారం ఇవ్వడం మెుదలుపెట్టారు.


దీంతో గ్రామస్థులంతా వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్‌ను సేకరించడం ప్రారంభించారు. ఎక్కడా చిన్న ప్లాస్టిక్ ముక్క కనిపించినా వదిలిపెట్టలేదు. కేవలం 15 రోజుల్లో ఊరంతా ప్లాస్టిక్ రహితంగా మారిపోయింది. గ్రామంతో పాటు సమీపంలోని వాగులు, నదులు, చెరువులు కూడా శుభ్రమయ్యాయి. రెండు వారాల్లోనే అనూహ్య మార్పును చూసి అధికారులే విస్తుపోయారు. ప్రభుత్వ పథకం కాకపోయినా సర్పంచ్ చొరవతో గ్రామస్థులు సాధించిన ఈ విజయంతో సాదివార గ్రామాన్ని స్వచ్ఛభారత్‌ అభియన్‌-2 కింద ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా ప్రకటించారు.


ఈ ఉద్యమం ఆ గ్రామంతో ఆగిపోలేదు. చుట్టుపక్కల గ్రామాలు కూడా దీనిని ప్రేరణగా తీసుకుని తమ పంచాయతీల్లోనూ అమలు చేయడానికి ముందుకొచ్చాయి. సాదివార సర్పంచ్ ఫారూక్‌ ఏఎన్ఐ‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ విధానంతో గ్రామమే కాకుండా సమీపంలోని వాగులు, నదులు కూడా శుభ్రమయ్యాయని తెలిపారు.‘పాలిథిన్ తెచ్చి ఇస్తే బహుమతి ఇస్తాననే నినాదాన్ని మా గ్రామంలో ప్రారంభించాను.. నదులు, వాగులు శుభ్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టాను.. ప్రస్తుతం గ్రామంలోని ప్రతి ఒక్కరూ సహకరించి ఎక్కడా పాస్టిక్ లేకుండా చేశారు.. గ్రామంలోని రోడ్లు, వీధులు శుభ్రమయ్యాయి.. ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా దానిని సేకరించి పంచాయతీ సభ్యులకు ఇస్తున్నారు.. మిగతా గ్రామాలకు మా ఊరు ఉదాహరణంగా నిలిచింది.. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనను కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.


‘చెత్త కుప్పలు, నదులు, రోడ్లు, వీధుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలని పంచాయతీ సూచించినప్పుడు గ్రామంలోని అన్ని వయసుల స్థానికులు ఆసక్తి చూపారు’ అని సాదివార యూత్ క్లబ్ ప్రెసిడెంట్ షకీల్ వనీ అన్నారు. అనంత్‌నాగ్ అభివృద్ధి విభాగం అసిస్టెంట్ కమిషనర్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘స్వచ్ఛ భారత్ అభియాన్ 2 కింద మన గ్రామాలను పాలిథిన్, చెత్త రహితంగా మార్చాలి.. ఈ విషయంలో జిల్లా యంత్రాంగంతో పాటు సదివార పంచాయతీ ఓ మోడల్ ప్రారంభించింది, ఇది ప్రభుత్వ పథకం కాదు తద్వారా ప్రజలు తమ గ్రామాలను శుభ్రం చేయడానికి ప్రేరణ పొందుతారు’ అని వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa