భార్య, కూతురి ఆచూకీ లేదంటూ ఓ వ్యక్తి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర కనిపించారు. వారం రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని.. ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని వాపోయాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన కిషోర్చంద్రరెడ్డి చెబుతున్న వివరాల ప్రకారం.. కిషోర్ భార్య శ్రావణి, పదేళ్ల కూతురితో కలిసి గతంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉండేవాళ్లు. భార్యాభర్తలు ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేశారు.
వీరు నివాసం ఉండే ఇంటికి సమీపంలో ఉండే కిరాణా వ్యాపారి శివయ్య.. ఏడాది క్రితం వారి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పట్లో అతడిపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత తమను బెదిరించడంతో జంగారెడ్డిగూడెం నుంచి వెళ్లిపోయామని కిషోర్ అంటున్నారు. ఆ తర్వాత తిరుపతి జిల్లా పాకాల సమీపంలోని ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నామన్నారు. అయితే అనారోగ్య కారణాలతో తన భార్య ప్రతి నెలా జంగారెడ్డిగూడెం వెళ్లి అక్కడి ఆస్పత్రిలో చూపించుకుని పాకాల వచ్చేది అన్నారు.
జంగారెడ్డిగూడెం వెళ్లిన ప్రతిసారీ శివయ్య కేసును రాజీ చేసుకోవాలంటూ కొందరు బెదిరించేవారని చెప్పుకొచ్చాడు. అందుకే జంగారెడ్డి గూడెం వెళ్లకుండా గుంటూరులోని ఆస్పత్రిలో వైద్యం కోసం ఈ నెల 3న సాయంత్రం తన భార్య, కుమార్తె పాకాలలో రైలెక్కి వెళ్లారన్నారు. ఆ రోజు రాత్రి 11 గంటలకు చివరిసారి తనతో ఫోన్లో మాట్లాడి తెనాలి సమీపంలో ఉన్నట్లు చెప్పారని.. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్చాఫ్ వచ్చిందన్నారు కిషోర్.
తాను 4న ఉదయం పాకాలనుంచి బయల్దేరి గుంటూరు వెళ్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదని.. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నాడు. రైల్వే పోలీసులను ఆశ్రయిస్తే తమకు సంబంధం లేదంటున్నారని.. సివిల్ పోలీసుల దగ్గరకు వెళితే రైల్వే పోలీసులు చూస్తారని చెబుతున్నారన్నారు. తాను గుంటూరు, తెనాలి, విజయవాడ వెళ్లి అధికారుల్ని కోరినా కేసు నమోదు చేయలేదన్నాడు.
తన భార్య, కూతురు ఏమయ్యారో తెలియడం లేదని.. గతంలో తన కూతురి పట్ల మా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. వారు ఏదైనా చేశారేమోననే అనుమానం ఉందని.. వారు బెదిరిస్తున్నారని జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశామన్నారు. తన భార్య, కుమార్తెల ఆచూకీ తెలపాలని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర తన బాధను చెప్పుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa