దక్షిణ కొరియాలోని తూర్పు తీర నగరం గ్యాంగ్నుంగ్ సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో నగరంలోని 500 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి.. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. బలమైన గాలుల కారణంగా గ్యాంగ్నుంగ్ పక్కనున్న అడవిలో మంటలు వ్యాపించాయి. అయితే అదృష్టం కొద్ది అప్పుడు వర్షం పడింది. దీంతో మంటలను ఆర్పడం సులభం అయ్యిందని గ్యాంగ్నుంగ్ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా.. మంటలు మరింత వ్యాపించే ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
గ్యాంగ్నుంగ్ కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు అడవిలో మంటలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగాయి. ఈ ఘటనలో.. దాదాపు 170 హెక్టార్లలో చెట్లు అగ్నికి ఆహుతైనట్టు అధికారులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు, డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయని జాతీయ అటవీ సంస్థ తెలిపింది. అగ్ని ప్రభావిత ప్రాంతంలోని కాలిపోయిన ఇంట్లో మధ్యాహ్నం తర్వాత ఒక మృతదేహం లభించిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
గ్యాంగ్నుంగ్ నగరం శివారులో లైవ్ ఓవర్ హెడ్ పవర్ కేబుల్స్ ఉన్నాయి. బలమైన గాలుల కారణంగా.. ఈ కేబుల్స్పై భారీ చెట్లు కూలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాలుల ప్రభావంతో ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడ్డారు. ఇదే సమయంలో.. వర్షం కురిసింది. దీంతో మంటలు తొందరగా అదుపులోకి వచ్చాయి. ఈ మంటలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీలైనంత త్వరగా మంటలను ఆర్పడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించాలని.. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి సమీపంలోని నివాసితులను త్వరగా ఖాళీ చేయించాలని.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ అధికారులను ఆదేశించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa