దేశ రాజధాని ఢిల్లీలో గతేడాది ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తల్లిదండ్రులు ఎక్కడో దాక్కున్నారని, వారిని బయటకు రప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘అతడి (అఫ్తాబ్) తల్లిదండ్రులు ఇంత వరకూ బయటకురాలేదు.. నా ఆలోచన ప్రకారం వాళ్లు ఎక్కడో దాక్కుకున్నారు.. వాళ్లు ఎక్కడున్నారు? వారిని బయటకు రప్పించండి.. నా కుమార్తెకు అంత్యక్రియలు జరిపించాలి.. ఆమె శరీర భాగాలను మాక్కు అప్పగించండి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు, అఫ్తాబ్ను ఉరితీయాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. ‘అతడికి ఉరిశిక్ష వేయాలి.. అతడు దోషి.. పక్కా ప్రణాళికతోనే నేరానికి పాల్పడ్డాడు.. కేసు విచారణ, దర్యాప్తులో కొన్ని లొసుగులు ఉన్నాయి దీని కారణంగా జాప్యం జరుగుతోంది.. కేసు విచారణను వేగవంతం చేయాలని కోరమని మా లాయర్కు చెప్పాను’ అని అన్నారు. నా కూతురు హత్యకు గురైన మే నాటికి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకూ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించలేకపోయామని గత నెలలో వికాస్ వాకర్ కన్నీటిపర్యంతమయ్యారు. నిందితుడికి ఉరిశిక్ష వేసిన తర్వాతే అంత్యక్రియులు నిర్వహిస్తానని అన్నారు.
విచారణ పూర్తయిన తర్వాతే శ్రద్ధా శరీర భాగాలను మాకు అప్పగించరని, అంత వరకూ ఆమెకు అంతిమ సంస్కరాలను నిర్వహించే పరిస్థితి లేదని వాపోయారు. నిర్బయ కేసు విచారణకు ఏడేళ్లు పట్టింది కానీ ఈ కేసు అన్నేళ్లు ఉండదని వికాస్ వాకర్ తరఫున లాయర్ సీమ కుశ్వాహా అన్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఆడియో-వీడియో రికార్డింగ్ కూడా ఆఫ్తాబ్ సమక్షంలో కోర్టులో ప్లే చేశారు. రికార్డింగ్లు విన్న శ్రద్ధా తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ‘అతను నన్ను వేటాడతాడు.. నన్ను పట్టుకుని చంపేస్తాడు’ అని శ్రద్ధా చెప్పడం వినిపించింది.
రికార్డింగ్లలో ఒక దానిలో ఒక రోజు ఆఫ్తాబ్ తన గొంతును పట్టుకున్నట్లు డాక్టర్ (కౌన్సెలర్) వద్ద ఆమె కూడా ఒప్పుకుంది. ‘నేను పూర్తి అచేతనంగా మారి ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అని రికార్డింగ్లో శ్రద్ధా చెప్పడం వినబడింది. దీనిపై న్యాయవాది కుష్వాహ స్పందిస్తూ.. ఈ విధంగా కేసు విచారణ పూర్తి కావడానికి ఏళ్లు పడుతుందని అన్నారు. ‘విచారణ రోజువారీ ప్రాతిపదికన జరగాలని, శ్రద్ధా తండ్రితో చర్చించినట్లు నేను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తాను’ అని ఆమె చెప్పారు.
శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా విసిరేసిన విషయం తెలిసిందే. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా.. శ్రద్ధా శరీర భాగాల కోసం పోలీసులు గాలించారు. మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో దవడ భాగాలు సహా 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa