పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో చైనా పౌరులు నిర్వహించే వ్యాపారాలు, సంస్థలను పాక్ పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. చైనాతో తమకున్న వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీస్తోన్న తీవ్రవాద దాడులను నిరోధించేందుకు పాక్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్లో తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ గత నెలలో తాత్కాలికంగా ఇస్లామాబాద్లోని ఎంబసీని చైనా మూసివేసింది. ఈ నేపథ్యంలో కరాచీలో చైనా పౌరుల వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేయడం గమనార్హం. బీజింగ్ నుంచి అనేక అభ్యర్థనలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ పాక్లోని చైనా పౌరుల రక్షణ విషయంలో అక్కడ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో చైనా నుంచి తీసుకున్న భారీ రుణాన్ని మాఫీ చేయాలని లేదా రాబోయే డిఫాల్ట్ను నివారించడానికి గడువును పొడిగించాలని పరోక్షంగా డ్రాగన్పై పాక్ ఒత్తిడి తెస్తోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)తో సంబంధం ఉన్న ప్రాజెక్టులు, చైనా పౌరులను పాక్లోని పలు ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి.
వాణిజ్య ప్రాజెక్టులు, మైనింగ్ కార్యకలాపాలు, ఇతర ఆర్థిక పెట్టుబడుల ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే నెపంతో చైనా నెమ్మదిగా తమ భూమిని ఆక్రమిస్తోందని నమ్ముతోన్న పాకిస్తానీయుల సంఖ్య పెరుగుతోందని అనుమానిస్తున్నారు. పాక్ జనాభాలో పెరుగుతున్న చైనా వ్యతిరేక భావాలను స్థానిక ప్రభుత్వానికి, భద్రతా సంస్థలకు నియంత్రించడం కష్టంగా మారుతోంది. తత్ఫలితంగా చైనా పౌరుల రక్షణకు అవసరమైన చర్యలను పాక్ అధికారులు తీసుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా సంక్షోభం దృష్ట్యా దేశంలో చైనా ప్రయోజనాల పరిరక్షణకు మరో ప్రత్యేక సైనిక విభాగానికి ఆర్థిక సహాయం చేయలేని స్థితిలో పాక్ ఉందని అంతర్జాతీయ నివేదిక పేర్కొంది. పర్యవసానంగా బీజింగ్ ఇప్పటికే ఉన్న భద్రతా ఏర్పాట్లపై అసంతృప్తిగా ఉంది. ఈ విషయంలో పదేపదే ఆందోళన చెందుతోంది. ఈ ఏడాది జనవరిలో పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో సమావేశమైన చైనా విదేశాంగ మంత్రి క్విన్ జంగ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ‘పాకిస్థాన్లోని చైనా పౌరుల భద్రతపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం.. ఈ విషయంలో పాక్ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని క్విన్ జంగ్ అన్నారు.
భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) పాలనలో ఉన్న సింధ్ ప్రావిన్సుల్లో చైనా సంస్థలు, పౌరులు ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పును ఎదుర్కొంటున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఉగ్రదాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కరాచీలోని చైనా పౌరుల వ్యాపార సంస్థలను పోలీసులు మూసివేసి, చర్యలు తీసుకుంటున్నారు.
పదేపదే హెచ్చరికలు ఉన్నప్పటికీ, అనేక చైనీస్ యాజమాన్యంలోని వ్యాపారాలు భద్రతా ప్రోటోకాల్లను అమలు చేయడంలో విఫలమయ్యాయి, సంతృప్తికరమైన భద్రతా ఏర్పాట్లు చేసే వరకు వాటిని మూసివేయాలని నిర్ణయించినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. చైనా రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, సముద్ర ఉత్పత్తుల సంస్థలను సింధ్ సెక్యూరిటీ ఆఫ్ వల్నరబుల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందట తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa