ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం,,, జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 18, 2023, 09:21 PM

హిమాలయాల ఒడిలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం.. అమర్‌నాథ్ యాత్రకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభమైంది. 62 రోజుల అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా.. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు యాత్ర జరగనుంది. ఈ యాత్ర సాధారణంగా రెండు మార్గాల ద్వారా అనుమతిస్తారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ మీదుగా యాత్రకు అనుమతిస్తారు. ఈ మార్గాల్లో యాత్రకు వెళ్లేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.


అమర్‌నాథ్ యాత్రికుల నమోదు ప్రక్రియ కోసం.. దేశవ్యాప్తంగా 542 బ్యాంకుల్లో ఏర్పాట్లు చేశారు. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 316 శాఖలు, జమ్మూ కాశ్మీర్‌లోని 90 శాఖలు, యెస్ బ్యాంక్‌కు చెందిన 37 శాఖలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 99 శాఖలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది యాత్రికుల నమోదు ఆధార్ ఆధారితంగా ఉంటుందని చెప్పారు. ఈసారి అమర్‌నాథ్ యాత్రకు పేరు నమోదు చేసుకునేటప్పుడు.. యాత్రికుల బొటనవేలును స్కాన్ చేయనున్నారు.


అమర్‌నాథ్ యాత్ర కోసం అధికారిక వెబ్‌సైట్ www.jksasb.nic.in లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అంతే కాకుండా.. మొబైల్‌ యాప్ (శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర యాప్, శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర యాప్) డౌన్‌లోడ్ చేసుకుని తమ పేరు నమోదు చేసుకోవచ్చు. 13-70 ఏళ్ల వయస్సు గల వ్యక్తులు.. తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. గర్భిణీలను యాత్రకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.


'ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎటువంటి సమస్య లేకుండా చూస్తున్నారు. అధికారులు కూడా ఉత్తమ సేవలను అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. యాత్ర ప్రారంభం కాగానే.. అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకొస్తారం. టెలికాం సేవలను విస్తరిస్తాం' అని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వివరించారు.


అమర్‌నాథ్ పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని.. వ్యర్థాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా అధికారులను ఆదేశించారు. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) యాప్ ద్వారా.. భక్తులు అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర పూజ కార్యకలాపాలను మొబైల్‌లోనే చూడవచ్చు. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఉదయం, సాయంత్రం హారతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తుంది. అమర్‌నాథ్ యాత్ర యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa