కొత్తూరు వంశధార నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్పై వ్య. కా. స ఆధ్వర్యాన నిర్వాసితులు తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్ నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని సందర్శించి, అధికారంలోకొచ్చాక 2013 భూసేకరణ చట్టాన్ని వర్తింపజేసి పరిహారం చెల్లిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా, మెళియాపుట్టిలో ఎన్నికల సభలో మరోసారి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చారని చెప్పారు. అధికారంలోకొచ్చి నాలుగేళ్లవుతున్నా నేటికీ ఆ ఊసెత్తడం లేదని విమర్శించారు. నిర్వాసితులకు అదనపు పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండా, సగం మందికే పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. అర్హులైన నిర్వాసితులందరికీ అదనపు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న అదనపు పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేకుంటే నిర్వాసితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సంఘ నాయకులు తులసీరావు. ఎ. కృష్ణమూర్తి, కె. హారిక, నిర్వాసితులు కె. జోగమ్మ, కె. మీనా, బి. అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa