ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 5వ సీఎస్ కు సమ్మే నోటీసు..ఉద్యోగ సంఘాల నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 30, 2023, 10:34 PM

వచ్చే నెల మే 5వ తేదీన తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి సమ్మె నోటీసు ఇవ్వాలని ఆదివారం విజయవాడలో జరిగిన ఏపీజీఈఏ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. రెండు దశల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడతామని ఈ సందర్భంగా ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. మే 22న జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. జూన్‌ 14న జిల్లా కేంద్రాల్లో సీపీఎస్‌ రద్దు కోసం పోరాటం, జులై 5, 6 తేదీల్లో నంద్యాల, కర్నూలులో బహిరంగ ప్రదర్శనలు చేస్తామని సూర్యనారాయణ చెప్పారు. అక్టోబరు 31న చలో విజయవాడ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని సూర్యనారాయణ స్పష్టం చేశారు. తమ నిరసనల ద్వారా ఉద్యోగుల ఆగ్రహం ఎలా ఉంటుందో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చూపిస్తామన్నారు.


మరోవైపు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మూడో దశ ఉద్యమ కార్యాచరణను ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి తరఫున రెండు దశల్లో ఉద్యమాన్ని పూర్తి చేశామని.. ఈ క్రమంలో మూడో దశ ఉద్యమ పోరాటానికి సంబంధించిన ప్రణాళికపై ఉద్యోగ సంఘాలతో పాటు కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు పిలిచింది. ఈ భేటీలో ఏ అంశం తేలకపోవడంతో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని.. ఈ సమావేశంలో తమ ఉద్యమానికి కార్మిక సంఘాలు పూర్తిగా మద్దతు తెలిపాయన్నారు. డిమాండ్లు సాధించే వరకు తాము నల్ల బ్యాడ్జీలు ధరించే ఉంటామని స్పష్టం చేశారు. మే 8వ తేదీన ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఉపసంహరించాలని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.


మే 9వ తేదీ నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. మొదటి సదస్సును శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని.. దీనికి విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా ఉద్యోగులు హాజరవుతారని పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం గత 53 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెతన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మే 12 నుంచి 19వ తేదీ వరకు ‘ఉద్యోగుల ఆవేదన చెబుతాం’ అనే కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకు, 25 ఎంపీలకు వినతి పత్రాలు అందిస్తామన్నారు.


రెండో ప్రాంతీయ సదస్సును అనంతపురం, మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో నిర్వహిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మే 30న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఒక రోజు నిరాహార దీక్ష చేపడతామన్నారు. నాలుగో ప్రాంతీయ సదస్సు గుంటూరులో చేస్తామన్నారు. 53 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ.. ప్రభుత్వం అస్సలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తే, అక్రమ కేసులు ఉద్యోగులపై బనాయించడానికి ప్రభుత్వం చూస్తుందా అని ప్రశ్నించారు. ఈ ఉద్యమాన్ని చులకనగా చూడొద్దని.. మూడో దశ ఉద్యమం ద్వారా తమ శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa