ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రాలయంలో ఏడు నెలల చిన్నారిని అపహరణ...కిడ్నాపర్ల వేటలో పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 30, 2023, 10:33 PM

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్‌లో గతరాత్రి ఏడు  నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే దంపతులు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎటు వెళ్లాలో తెలియక మంత్రాలయం రైల్వేస్టేషన్‌లో నిద్రపోయారు. తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఆ దంపతులు స్టేషన్‌లోనే పడుకున్నారు.


అయితే తెల్లవారి చూసేసరికి తమ ఏడునెలల చిన్నారి కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు ఆ పరిసరాల్లో వెతికారు. లాభం లేకపోవటంతో చివరకు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు అనుమానితులను గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునే పనిలో పడ్డారు. కిడ్నాపర్ల కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.


తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. రెండ్రోజుల క్రితం హైదరాాబాద్‌లోనూ ఓ చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. ఉస్మానియా ఆసుపత్రి ఎదురుగా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తు్న్న ఓ యాచకురాలి రెండు నెలల పాపను కిడ్నాప్ చేశారు. మహారాష్ట్రకు చెందిన జ్యోతి, జార్ఖండ్‌కు చెందిన వికాస్ కుమార్ అనే ఇద్దరు పాపను కిడ్నాప్ చేశారు. పాప తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకొని పాపను సురక్షితంగా తల్లిఒడికిచేర్చారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి తల్లితో కిడ్నాపర్లు ఇద్దరు గత కొంతకాలంగా సఖ్యతగా మెలిగి ఆమె లేని సమయంలో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa