బ్లూ బగ్గింగ్ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ హెచ్చరించారు. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే బ్లూటూత్ పెయిర్ రిక్వెస్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దని సూచించారు. బహిరంగ ప్రాంతాలలోని ఉచిత వైఫై వాడకుండా ఉండటం ఉత్తమం అన్నారు. బ్లూటూత్ ద్వారా జరిగే బ్లూ బగ్గింగ్ తరహా సైబర్ మోసాల పట్ల అప్రమత్తత అవసరం అంటున్నారు. బ్లూ బగ్గింగ్ తరహా సైబర్ మోసాల తీరుపై , ప్రజలు అవగాహన కలిగి ఉండి.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్పీ తెలిపారు. హ్యాండ్ ఫ్రీ సాంకేతికత వలన నేటి రోజుల్లో చేతికి పెట్టుకున్న డిజిటల్ వాచీ, ఇయర్ పాడ్ పనిచేయాలన్నా, కారులోని మ్యూజిక్ సిస్టమ్తో అనుసంధానమవ్వాలన్న బ్లూటూత్ నే ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు.
ప్రస్తుతం అందరూ వైర్లెస్ పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారన్నారు. ఫోన్లో బ్లూటూత్, వైఫై, హాట్ స్పాట్ ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉండటం వలన సైబర్ నేరగాళ్లు మాటు వేసి ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకొని.. ఆ తర్వాత సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఇదే తరహాలో బ్లూ బగ్గింగ్ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు పది మీటర్ల దూరం నుంచే బ్లూటూత్, హాట్ స్పాట్ ద్వారా 'పెయిర్' రిక్వెస్ట్లు పంపుతారన్నారు. ఒకవేళ చూసుకోకుండా పొరపాటున 'ఓకే' బటన్ క్లిక్ చేయగానే.. సైబర్ నేరగాళ్ల ఫోన్ మన ఫోన్ కనెక్ట్ అయిన వెంటనే మాల్వేర్ తో పాటు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ ను మన ఫోన్లోకి పంపిస్తారన్నారు.
ఆ తర్వాత ఫోన్ ఆపరేటింగ్ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుందని.. మొబైల్ ఫోన్ లోని ఫొటోస్, ఫైల్స్, ఇతర ముఖ్యమైన డేటాని దొంగిలించి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారన్నారు. మన ఫోన్లో బ్లూ టూత్ ఆపేసినా వారు అప్పటికే పంపించిన ప్రోగ్రామింగ్, మాల్వేర్ వల్ల జరిగే నష్టం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు బ్లూ బగ్గింగ్ మోసాల బారిన పడకుండా ఉండటానికి పాటించాల్సిన జాగ్రత్తలను కొన్ని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అవసరమైతే తప్ప మిగిలిన అన్ని సమయాలలో బ్లూటూత్ ఆఫ్ చేయాలి. బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్లను రద్దీ ఉన్న, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచింది అన్నారు. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే పెయిర్ రిక్వెస్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దన్నారు. డేటాలో హెచ్చు తగ్గుల్ని గమనిస్తూ ఉండాలని, అదనపు భద్రతకు వీపీఎన్ వినియోగించాలి అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఉచిత వైఫై వాడకుండా ఉండటం ఉత్తమని ఎస్పీ సూచించారు. బ్లూ బగ్గింగ్ మోసానికి ఎవరైనా గురైనట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa