కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే యువగళంలో జనసేన పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలతో కలిసి జనసైనికులు కూడా పాల్గొన్నారు. జనసేన జెండాలు, యువగళం జెండాలు పట్టుకుని పాదయాత్రకి సంఘీభావం తెలిపారు. అలాగే ఆదివారం సాయంత్రం జరిగి బహిరంగ సభలో జనసేన కార్యకర్తలకు అభివాదం చేశారు లోకేష్. వారికి కూడా సభలో స్వాగతం పలికారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు హైదరాబాద్లో శనివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొత్తులతో పాటూ భవిష్యత్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించనట్లు తెలుస్తోంది. జగన్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని.. అలాగే పొత్తులపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి.. పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు ఇద్దరు నేతలు 45 నిమిషాలకుపైగా చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది.
ఎప్పటి నుంచో రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని ప్రస్తావించారు. అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల్ని కలిశారు. అప్పుడు కూడా పొత్తులపై చర్చలు జరిగినట్లు టాక్ వినిపించింది. బీజేపీ కూడా తాము జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళతామని చెబుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భేటీ చర్చనీయాంశమైంది.
అయితే అలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిశారో లేదు.. మరుసటి రోజే జనసైనికులు లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకే కారులో వెళుతూ జెండాలు చేతబట్టారు. అలాగే లోకేష్ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడే చుట్టాలైపోయారుగా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ, జనసేన శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నాయి. అయితే రెండు పార్టీల పొత్తుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
మరోవైపు కొందరు బీజేపీ నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలతో కలిసి తమ పార్టీ ముందుకు సాగుతుందని సంకేతాలు ఇస్తున్నారు. ఆ దిశగా తమవంతు ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. టీడీపీ, జనసేనలు కలిసి ఎన్నికల్లో పోటీకి వెళతాయా.. బీజేపీ కూడా తమతో కలుపుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa