దేశ రాజధాని ఢిల్లీలో కారు బానెట్పై ఓ వ్యక్తిని సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లారు. బాధితుడు ఓ క్యాబ్ డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు. ఆ వాహనం బీహార్కు చెందిన ఓ ఎంపీదని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఎంపీ ఆ వాహనంలో లేరు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం (ఏప్రిల్ 30) రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గా వైపు కారు దూసుకెళ్తోంది. ఆ కారు బానెట్పై ఓ వ్యక్తి ప్రమాదకరంగా ఉన్నాడు. డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా కారును అలాగే ముందుకు పోనిస్తున్నాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను అటుగా వెళ్తున్న కొంత మంది ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సమచారం అందుకున్న పోలీసులు ఆ మార్గం వైపు వచ్చారు. కారును ఓవర్ టేక్ చేసి నిలిపివేశారు. కారు నడిపిన వ్యక్తిని రామచంద్ర కుమార్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితుడు పేరు చేతన్. అతడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
‘నేనొక ప్యాసింజర్ను దింపి, తిరిగొస్తున్నా. ఆశ్రమ్ చౌక్ ప్రాంతంలో సదరు వ్యక్తి నా కారును మూడుసార్లు ఢీకొట్టాడు. దీంతో నేను నా కారును పక్కకు నిలిపేసి, దిగొచ్చి, అతడి కారుకు అడ్డుగా నిలబడ్డా. ఆ వెంటనే అతడు తన కారు వేగాన్ని పెంచడంతో నేను బానెట్పై పడిపోయా. కారు ఆపమని ఎంత బతిమిలాడినా ఆయన పట్టించుకోలేదు. పోలీసులు గమనించిన తర్వాతే నేను బయటపడ్డా’ అని చేతన్ చెప్పుకొచ్చాడు.
ఘటనా సమయంలో నిందితుడు ఫూటుగా తాగున్నాడని చేతన్ చెప్పాడు. అయితే, నిందితుడు మాత్రం ఈ ఆరోపణలను ఖండించాడు. క్యాబ్ డ్రైవరే ఉద్దేశపూర్వకంగా బానెట్పైకి దూకాడని ఆరోపించాడు.
‘నా కారు అతడి కారును తాకను కూడా తాకలేదు. నేను డ్రైవింగ్ చేస్తుండగా అతడు ఉద్దేశపూర్వకంగా నా కారు బానెట్పైకి దూకాడు. దిగమని నేను అడిగాను. కానీ, అతడు వినిపించుకోలేదు. నేను నా కారును ఆపి, ఏం చేస్తున్నావని అతడిని అడిగాను?’ అని నిందితుడు చెబుతున్నాడు.
ఢిల్లీలో కొన్ని నెలల కిందట ఇలాంటిదే మరో ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి ఓ యువతి బైక్ను ఢీకొన్న కారు.. ఆమె కారు ముందు భాగం వద్ద వేలాడుతుండగా.. అలాగే 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa