మణిపూర్లో ఉన్న విద్యార్థులను తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని అన్నారు. ఈ మేరకు నారా లోకేష్ ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.
మణిపూర్లో తలెత్తిన ఘర్షణలతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించారని.. ఇప్పటికే పరస్పర దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారని లోకేష్ అన్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతోందని తెలిపారు. వివిధ యూనివర్సిటీలు, ఎన్ఐటీల్లో వందలాది మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారని.. భద్రత విషయమై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారిని తక్షణమే రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యార్థులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సురక్షితంగా తీసుకొచ్చిందని.. ఏపీ విద్యార్థులు మాత్రం బిక్కుబిక్కుమంటూ మణిపూర్లో ప్రాణభయంతో గడుపుతున్నారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లని విద్యార్థులు ఎలా సంప్రదించగలరని లోకేష్ ప్రశ్నించారు. కాల్ సెంటర్ల పేరుతో కాలయాపన చేయొద్దని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని.. మణిపూర్ ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర విద్యార్థులను రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
‘‘మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో అక్కడున్న ఏపీ విద్యార్థులు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. వారిని తక్షణమే రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలి. తెలంగాణ విద్యార్థులను ప్రత్యేక విమానంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఏపీ సర్కారు మాత్రం కాల్ సెంటర్ పేరుతో కాలయాపన చేస్తోంది. బయటకి రావాలంటే కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత, ఇంటర్నెట్ సేవలకి అంతరాయం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు వేర్వేరు క్యాంపస్లలో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఉన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మణిపూర్ ప్రభుత్వంతో మాట్లాడి, విద్యార్థులను ప్రత్యేక విమానంలో మన రాష్ట్రానికి తరలించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలి.’’ అని నారా లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa