తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై వైసీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పులివర్తి నాని బుధవారం సాయంత్రం ఆరోపించారు. చెర్లోపల్లి పంచాయితీలో "మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని" కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి తిరుగుతున్న సందర్భంలో చాలా చోట్ల టీడీపీ సానుభూతి పరుల ఫించన్లు తొలగించడం, రేషన్ కార్డులు రద్దు చేయడం, ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురిచేయడం, చివరికి వికలాంగులను కూడా బెదిరించడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యంచేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తప్పుబట్టారు. వ్యవస్థలను గౌరవించాలి తప్ప కక్ష సాధింపు ధోరణి తగదన్నారు. ఎన్నికల ముందు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పులివర్తి నాని ఆరోపించారు. ఇదేనా పార్టీలకు అతీతంగా సేవలందించడం అని సూటిగా ప్రశ్నించారు. ప్రతి గ్రామానికి సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు శాయాశక్తులా కృషి చేస్తానని చెప్పి నాలుగేళ్లుగా టీడీపీ సానుభూతి పరులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీలకు అతీతంగా అందరికీ ఒకే విధంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పులివర్తి నాని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa