ఎండ తీవ్రత, వడగాడ్పులకు దాదాపు అన్ని ప్రాంతాలు మండిపోయాయి. నడినెత్తిన నిప్పులు పోసినట్టు కాసిన ఎండ దెబ్బకు ఉక్కపోత కూడా తోడవడంతో ప్రజలు విలవిల్లాడారు. పడమర, వాయువ్య దిశ నుంచి వీచిన పొడిగాలులకు సోమవారం ఉదయం నుంచే రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్న సమయంలో తీవ్రంగా వీచిన వడగాడ్పులకు భూమి నుంచి సెగలు వచ్చాయి. ఈ సీజన్లో తొలిసారిగా అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం... 18 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 131 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4, కృష్ణా జిల్లా కోడూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొన్నూరులో 45.9, రాజమండ్రి, ఆగిరిపల్లెలో 45.7, గోపాలపురంలో 45.4, గుంటూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేకచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, వడదెబ్బకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa