దేశ ఆర్థిక, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు ఈ సారి మూడు రోజులు ఆలస్యం కానున్నాయి. జూన్ 4న ఇవి కేరళను తాకనున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న (ప్లస్ ఆర్ మైనస్ నాలుగు రోజులు) తాకాల్సి ఉంది. అయితే ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు కేరళ కంటే ముందు మే 22న దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ మంగళవారం రాత్రి బులెటిన్లో పేర్కొంది. వాయవ్య భారతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతంలో ప్రీమాన్సూన్ వర్షాలు, దక్షిణ చైనా, ఆగ్నేయ హిందూ మహాసముద్రం నుంచి వెలువడే రేడియేషన్, వాయవ్య పసిఫిక్, ఈశాన్య హిందూ మహాసముద్రంలో గాలుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న వాతావరణ శాఖ.. రుతుపవనాలు జూన్ 4న కేరళను తాకనున్నాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రవేశానికి సంబంధించి 2005 నుంచి భారత వాతావరణ శాఖ ప్రతి ఏడాది బులెటిన్లు విడుదల చేస్తోంది. ఒక్క 2015లో తప్ప మిగిలిన సంవత్సరాల్లో వాతావరణ శాఖ అంచనా (ప్లస్ ఆర్ మైనస్ నాలుగు రోజులు) మేరకే కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఇదిలావుండగా ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం (96 శాతం) నమోదవుతుందని వాతావరణ శాఖ గత నెలప్రకటించింది. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 70% నైరుతి సీజన్లో కురుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa