ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీపార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించాడు: పోసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 07:36 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై  పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు గుప్పించారు. నందమూరి లక్ష్మీపార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించాడని, కానీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్‌) మాత్రం అవేవీ పట్టించుకోలేదని ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళి అన్నారు. ఎన్టీఆర్‌ 100వ జయంతి సందర్భంగా వివిజవాడలోని ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌, దేవినేని నెహ్రూ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరన్నారు. ఎన్టీఆర్ నెంబర్‌ వన్‌ హీరో అని అందరికీ తెలుసని.. ఆయనే కృష్ణుడు అని తెలుసు.. వెన్నుపోటు పొడిపించుకున్నవారని కూడా తెలుసన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు చేతుల్లో చనిపోయారని తెలుసు.. ఇక తాను చెప్పాల్సింది ఏమీ లేదన్నారు.


అయితే, ఎన్టీఆర్‌ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతానంటూ పోసని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ తన జీవితంలోకి లక్ష్మీపార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నారని తెలిపారు. లక్ష్మీపార్వతికి అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయని.. ఆమె ఒక లెక్చరర్‌ అని గుర్తు చేశారు. లక్ష్మీపార్వతికి సంస్కృతం బాగా వచ్చని.. ఆమె గొప్ప మేధావి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్‌ పక్కన ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబు భావించారని.. అందుకే ఎలాగైనా ఆమెను బయటకు పంపించాలని కుట్ర పన్నారని చెప్పారు.


ఇందులో భాగంగానే లక్ష్మీపార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని చంద్రబాబు పుకార్లు పుట్టించారని.. ఇదే విషయం ఎన్టీఆర్‌ వరకు కూడా వెళ్లింది పోసాని కృష్ణమురళి చెప్పారు. అయితే, ఓ రోజు ఎన్టీఆర్‌.. లక్ష్మీపార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంట్లోకి పిలిపించుకుని.. తిరుపతి లడ్డూను ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ‘దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీపార్వతికి, నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అని ప్రశ్నించారని తెలిపారు. దీంతో అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..‘లక్ష్మీపార్వతి నాకు తల్లి లాంటిది సర్‌. నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పారన్నారు.


అప్పుడు వెంటనే ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులందర్నీ పిలిపించి.. తన ఆరోగ్యం సహకరించడం లేదని, తోడు కోసం ఆ అమ్మాయి (లక్ష్మీపార్వతి)ని పెళ్లి చేసుకుంటానని చెప్పారని పోసాని తెలిపారు. అయితే, అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదని.. దీనికి కారణం ఎన్టీఆర్‌ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయమని చెప్పారు. కానీ, లక్ష్మీపార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్‌ దగ్గర ప్రస్తావించలేదని.. ఒక గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడిందన్నారు.


చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు వచ్చిందని.. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా ఆయన్ను లక్ష్మీపార్వతి చూసుకున్నారని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఎన్టీఆర్‌ను పట్టించుకోలేదన్నారు. ఎన్టీఆర్ చనిపోయినా ప్రజల్లో ఆయన్ని బతికించుకోవడం కోసం లక్ష్మీపార్వతి ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌ ఆస్తులన్నీ చంద్రబాబు, వారసులు తీసుకుంటే.. లక్ష్మీపార్వతి మాత్రం ఇప్పటికి ఆయన పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతున్నారని చెప్పారు.


అవార్డులు, సేవా కార్యక్రమాలు చేయడం కోసం లక్ష్మీపార్వతి తన గాజులతో సహా అన్ని అమ్ముకున్నారని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్‌ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. రామరావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని.. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలని పోసాని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa